
రైళ్లు బిరబిర.. వసతులు అరకొర
బళ్లారిటౌన్: నగరంలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ మీదుగా చాలా రైళ్లు వెళుతున్నా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా సింధనూరు– బెంగళూరు మధ్య సంచరించే రైళ్లు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్కు వెళ్లకుండా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ నుంచి బైపాస్ క్యాబిన్ మీదుగా వెళుతున్నందున రైళ్ల రాకపోకల కోసం కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ స్టేషన్లో తగిన తాగునీరు, మరుగుదొడ్లు, లిఫ్ట్ లేకపోగా, కూర్చొనేందుకు తక్కువ ఆసనాలు ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు అటు నుంచి ఇటు, ఒకటో ప్లాట్ఫాం నుంచి రెండవ ప్లాట్ఫారం చేరుకోవాలంటే మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ రైళ్లు బెంగళూరుకు ఎక్కువగా ఉన్నందున రోగులు, ఉన్నత వైద్యం కోసం వీటిని ఆశ్రయిస్తుంటారు. అయితే సరైన సదుపాయాలు లేనందున ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. గతంలో ఈ రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్కు వచ్చి వెళుతుండేవి. కాని ప్రధాన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ సాకుతో కొన్ని రైళ్ల రాకపోకల దిశను మార్చివేశారు.
పట్టించుకోని పాలకులు, అఽధికారులు
కంటోన్మెంట్ రైల్వేస్టేషన్కు వచ్చే రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు, పాలకులకు తెలిపినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాలకు భద్రత లేనందున దొంగతనాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు ఇక్కడ నిలిపి ఉంచేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా అయితే రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాలు ఉంచేందుకు భద్రత కల్పిస్తారు. ఇక్కడ లేనందున పలుసార్లు దొంగతనాలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్టీల్ సిటీగా పేరుగాంచిన బళ్లారిలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య అఽధికంగా ఉంది. రైల్వే స్టేషన్లో వసతులు కల్పించడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నిత్యం ప్రయాణికులకు తప్పని అవస్థలు
మౌలిక సదుపాయాలు కరువైన
కంటోన్మెంట్ రైల్వేస్టేషన్
సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తా
సమస్యలపై కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు కేఎం మహేశ్వర స్వామి దృష్టికి తీసుకెళ్లగా రాయదుర్గం నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లకు జిల్లా స్టేడియం వద్ద మరో నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తాము కూడా ఈ విషయంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. అంతవరకు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఉన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు.
–రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి

రైళ్లు బిరబిర.. వసతులు అరకొర

రైళ్లు బిరబిర.. వసతులు అరకొర