
నోరూరిస్తున్న నేరేడు పండ్లు
బళ్లారి టౌన్: ఒకప్పుడు సామాన్య ప్రజలు కొనేందుకు వెళితే అధిక ధరలతో వెక్కిరించే నేరేడు పండ్లు ఈ ఏడాది సామాన్యులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. గత ఏడాది కిలో రూ.200లు పలికిన ఈ పండ్లు ఈఏడాది కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో అధిక దిగుబడి వచ్చినందున ధరలు తగ్గాయని రైతులు తెలిపారు. పండ్లను పండించేందుకు పేరుగాంచిన డీ.నాగేనహళ్లిలో మామిడి, సపోటా, నేరేడు పండ్లను ఎక్కువగా పండిస్తారు. నగరానికి కూడా ఈ ప్రాంత వాసులే ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతుంటారు. ప్రధానంగా తాలూకా ఆఫీసు, అనంతపురం రోడ్డు, కూల్ కార్నర్ సెంటర్, సుధా క్రాస్ వంటి అధిక జన రద్దీ గల ప్రాంతాల్లో రైతులు తీసుకువచ్చి ఉదయం తాజాగా ఉన్నప్పుడు కిలో రూ.100 ధరకు, సాయంత్రం రూ.80 నుంచి రూ.60 ధరకు అమ్ముతున్నారు. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో షుగర్ పేషెంట్లు ఎక్కువగా వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా ఈసారి నేరేడు పండ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడ అధికంగా కనిపిస్తూండటంతో సామాన్యులు కొనేందుకు ఆశక్తి చూపుతున్నారు.
ముందస్తు వర్షాలతో
ఈసారి అధిక దిగుబడి
సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న వైనం

నోరూరిస్తున్న నేరేడు పండ్లు