
పదవిని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ
కోలారు : దివంగత ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశంపై అత్యవసర పరిస్థితిని రుద్దారని, ఫలితంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు అరవింద లింబావళి తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని కన్నడ భవనంలో సిటిజన్ ఫోరం సోషల్ జస్టిస్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో పత్రికలపై సెన్సార్షిప్ విధించారని, వేలాది మంది ప్రతిపక్ష నేతలను జైళ్లలో వేశారన్నారు. నాటి కాంగ్రెస్లోని కీచలాటలు కూడా అత్యవసర పరిస్థితిని విధించడానికి ఒక కారణమైందన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో సిద్దరామయ్య కూడా జైలులో ఉన్న విషయాన్ని ఆయన మరచి పోయినట్లున్నారన్నారు. ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు కేవీ శంకరప్ప, జేడీఎస్ నాయకుడు సిఎంఆర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అత్యవసర పరిస్థితిలో పోరాటాలు సాగించిన వారిని సన్మానించారు.