
ఏ క్షణంలోనైనా తుంగభద్ర తుళ్లింత
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంకు వరద పోటెత్తి క్రమంగా నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంకు 60 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో రూపంలో వస్తుండటంతో డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 65 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్గేట్లు బలహీనంగా ఉండటంతో డ్యాంలో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని ఇటీవల తీర్మానించారు. ఈనేపథ్యంలో డ్యాం నిండితే ఏక్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా గత ఏడాది డ్యాంలో 19వ క్రస్ట్గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. డ్యాంలో 100 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని మిగిలిన నీరు డ్యాం నుంచి నది ద్వారా దిగువకు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత పదేళ్లలో జూలై మొదటి వారంలోనే కాలువలకు నీరు విడుదల చేయడంతో పాటు నదికి కూడా నీరు వదులుతుండటం విశేషం.
లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరిక జారీ