
వైభవోపేతంగా మైసూరు దసరా
శివాజీనగర: రాష్ట్ర పండుగ మైసూరు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఆచరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి దసరా 10 రోజులు కాకుండా 11 రోజులు జరుపుతారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 రాత్రి వరకు సాగుతుంది. మైసూరు దసరా సంబరాల గురించి శనివారం బెంగళూరులో విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సిద్దరామయ్య, మైసూరు దసరా వేడుకలలో ప్రజల భద్రత, సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఉండాలి. ఆడంబరం మాటున దసరా చరిత్రాత్మక ప్రాధాన్యత కనుమరుగు కారాదన్నారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వైభవం కాదు. దసరా చరిత్ర యశస్సును కాపాడుతూ ప్రజల అనుకూలాలను దృష్టిలో పెట్టుకొని వేడుకలను ఆచరించాలని సూచించారు. దసరా సమయంలో పోలీసులు పర్యాటకులతో ప్రేమాభిమానంతో ప్రవర్తించాలని తెలిపారు.
ఆర్భాటంగా జరుపుతాం
రాష్ట్రంలో ఈసారి కూడా మంచి వర్షాలు పడ్డాయి. నదులు, చెరువులు నిండిపోయాయి. అందుచేత ఈసారి దసరాను వైభవంగా ఆచరిస్తామని సీఎం తెలిపారు. దసరా సమయంలో ప్రభుత్వ సాధనలను ప్రతిబింబించే వస్తు ప్రదర్శన, స్తబ్ధ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 2న విజయదశమి వచ్చింది, శకటాల్లో గాంధీ ఆశయాలను కూడా అద్దంపట్టేలా ఉండాలన్నారు. వేడుకలలో 10 లక్షల మందికి పైగా ప్రజలు చేరుతారు, విదేశీయులు ఎక్కువగా రావచ్చు, అందుచేత ప్రమాదాలు సంభవించకుండా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు వహించాలి, ప్యాలెస్ ముందు రద్దీ నియంత్రణ చేపట్టాలన్నారు.
వసతులకు లోటు రాకూడదు
మైసూరులోని అన్ని రోడ్లకు ఇప్పటినుంచే మరమ్మతు పనులు ప్రారంభించాలని, గతేడాది మాదిరిగా ఈదఫా కూడా నగరాన్ని సుందరంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని సీఎం తెలిపారు. గతంలో దసరా ఆచరణకు రూ.40 కోట్లు కేటాయించాం, ఈసారి కూడా నిధులు ఇస్తామన్నారు. మైసూరు నగర సౌందర్యాన్ని పెంచాలి, దసరా నెపంతో ప్రజల పనులు, అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూడాలని తెలిపారు.
ప్రజల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట
సీఎం సిద్దరామయ్య సూచన
ఈసారి 11 రోజుల పాటు సంబరాలు
దసరాకల్లా సీఎం మార్పు
బీజేపీ పక్ష నేత అశోక్
మైసూరు: కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చడం కచ్చితమని, అందువల్ల త్వరలో జరిగే మైసూరు దసరా ఉత్సవాలను కొత్త ముఖ్యమంత్రి ప్రారంబిస్తారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. శనివారం మైసూరులో ఓ కళ్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం మార్పు తథ్యమని, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. సిద్దరామయ్య ఏమీ కాలేదనే రీతిలో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్లో అధికారం కోసం కుమ్ములాట తారాస్థాయికి చేరిందని, పైగా అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. సిద్దరామయ్య మాత్రం అబద్ధాలు చెబుతూ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారని, అసలైన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో ఉండేదని అన్నారు.
సెప్టెంబరు 22 నుంచి దశమి వేడుకలు
అక్టోబరు 2న జంబూసవారీ ఉత్సవం
మైసూరు: ఈసారి నాడహబ్బ విజయదశమి ఉత్సవాలకు ఆగస్టు 4వ తేదీన గజ పయనం మొదలవుతుంది. నాగరహోళె అరణ్యంలో వీరనహోసహళ్ళి గ్రామం వద్ద ఏనుగులకు స్వాగతం పలుకుతారు. అక్కడ సంబరాల తరువాత మైసూరుకు చేరుకుంటాయి. దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10:10 గంటలనుంచి 10:40 గంటల శుభ వృశ్చిక లగ్నంలో చాముండికొండ పైన నాడదేవత చాముండేశ్వరి మాతకు విశేష పూజలతో ఆరంభిస్తారు. అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 1:18 గంటల ధనుర్ లగ్నంలో రాజప్రముఖులు దసరా పూజను గావిస్తారు. ఆ రోజు సాయంత్రం సుమారు 4:42 గంటల నుంచి 5:06 గంటల శుభ కుంభ లగ్నంలో జంబూసవారీ ఊరేగింపు జరుగుతుంది.

వైభవోపేతంగా మైసూరు దసరా

వైభవోపేతంగా మైసూరు దసరా

వైభవోపేతంగా మైసూరు దసరా