
నెలలోగా బెంగళూరు పాలికెల ఖరారు
● రూ. లక్ష కోట్లతో నగరాభివృద్ధి: డీసీఎం
బనశంకరి: కెంపేగౌడ వేసిన పునాదిపై మేము బ్రాండ్ బెంగళూరును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నామని, మనందరం కలిసి బలిష్టమైన, శాంతియుత, గ్రీన్, బెంగళూరును నిర్మిద్దామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో నాడప్రభు కెంపేగౌడ 516 జయంతి ఉత్సవం, పలు రంగాలలో సేవచేసిన 53 మందికి కెంపేగౌడ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డీకే పాల్గొని మాట్లాడారు. మనిషి గా జననం, మరణం అనివార్యమని, ఈ రెండింటి మధ్య మనం ఏమి సాధించామనేది చాలా ముఖ్యమన్నారు. బెంగళూరు అన్నివర్గాల ప్రజల శాంతి తోట అని, దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. గ్రేటర్ బెంగళూరుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నామని, సిటీని ఎన్ని పాలికెలుగా చేయాలనేది నెలలోగా తీర్మానిస్తామని తెలిపారు. సొరంగ మార్గం రోడ్డుకు రూ.37 వేల కోట్లు, ఫ్లై ఓవర్లకు రూ.17వేల కోట్లు, స్వచ్ఛతకు రూ.15 వేల కోట్లతో పాటు బెంగళూరు సమగ్రాభివృద్ధికి రూ.లక్ష కోట్లతో పథంకం రూపొందించామని తెలిపారు. మీడియా విమర్శలను సంతోషంగా స్వీకరించి పనిచేస్తామని చెప్పారు.
చావే శరణ్యం
● రాష్ట్రపతికి వృద్ధ దంపతుల లేఖ
యశవంతపుర: తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు.
దావణగెరె బంద్
దొడ్డబళ్లాపురం: భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీరు తరలించేందుకు చేపడుతున్న పనులను వ్యతిరేకిస్తూ శనివారంనాడు దావణగెరె బంద్ జరిగింది. ఇందుకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేపట్టాలనుకోవడం దారుణమని బీజేపీ ఆరోపించింది. భద్రా డ్యాం నుంచి మంగళూరుకు నీటిని తరలిస్తే ఈ జిల్లా రైతులకు, ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని రైతు నేతలు చెప్పారు. ఇందుకు అనుమతించబోమని బంద్ నిర్వహించగా ఓ మోస్తరుగా స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు తగ్గాయి. కొన్నిచోట్ల ఆఫీసులు మూతపడ్డాయి.

నెలలోగా బెంగళూరు పాలికెల ఖరారు