
గోవధ.. పులికి మరణ శాసనం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర పరిధిలోని అరణ్యంలో హూగ్యం వలయంలో ఓ తల్లి పులి, దాని నాలుగు పిల్లలను దుండగులు విషాహారం పెట్టి చంపడం సంచలనం కలిగిస్తోంది. అరుదైన వన్యజీవులను పొట్టనపెట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు స్థానికులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. హనూరు తాలూకాలోని కొప్ప గ్రామానికి చెందిన మాద అలియాస్ మాదరాజు, నాగరాజ్, కోనప్పను పోలీసులు, అటవీ సిబ్బంది అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తన ఆవును పులి చంపి తిన్నందుకు తానే విషం పెట్టి చంపినట్లు మాదరాజు తండ్రి శివణ్ణ మొదట తెలిపాడు. తానే పులి కుటుంబాన్ని చంపినట్లు చెప్పాడు. అయితే తీవ్రంగా అనుమానపడిన పోలీసులు విచారణ జరపగా శివణ్ణ కుమారుడు మాదరాజు హస్తం బయటపడింది. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆవును పులి చంపి కొంత తినేసింది. ఈ కోపంతో ఆవు కళేబరంపై పురుగుల మందును చల్లాను, తరువాత వచ్చి ఆ మాంసాన్ని తిన్న పులి, పిల్లలు మృత్యువాత పడ్డాయని వివరించాడు.
ల్యాబ్కు శరీర భాగాలు
మరింత దర్యాప్తు కోసం పులి, ఆవుల శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అటవీ అధికారులు తెలిపారు. దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి సమితిని ఏర్పరిచామని, వారు కూడా పరిశీలించారని చెప్పారు. ఘటనాస్థలిలో పరిసరాల మొబైల్ఫోన్ లొకేషన్పై దృష్టి పెట్టారు. పులులకు విషం పెట్టినట్లు రుజువైతే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని రిటైర్డ్ డీసీఎఫ్ పూవయ్య తెలిపారు.
మరో పులి మృత్యువాత
మైసూరు: సరిహద్దుల్లో గుండ్లుపేట తాలూకాలోని బండిపుర పులి అభయారణ్యంలో మరో పులి మృత్యువాత పడింది. గుండ్రే ప్రాంతంలో ఐదేళ్ల ఆడపులి కళేబరం లభ్యమైంది. అటవీశాఖ గస్తీ సిబ్బంది దానిని కనుగొన్నారు. ఆ పులిది సహజ మరణమేనని తెలుస్తోంది. అటవీ అధికారులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఆవు కళేబరంపై పురుగుల మందు పిచికారీ
దానిని భక్షించి తల్లీ, పిల్ల వ్యాఘ్రాల మృతి
ముగ్గురు అరెస్టు

గోవధ.. పులికి మరణ శాసనం