
అట్టహాసంగా తంబిట్టు
కోలారు: తాలూకాలోని టి గొల్లహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నల్లూరులో శనివారం ఊరి పండుగ సందర్భంగా గ్రామ దేవతకు తంబిట్టు దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఊరి పండుగను జరపలేదు. దీంతో ఈసారి గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. గ్రామాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇతర ప్రాంతాలలో స్థిరపడినవారు కుటుంబాలతో తరలివచ్చారు. గ్రామ దేవతలు గంగమ్మ, వీరభద్ర, కుంటి గంగమ్మ, సుగ్గులమ్మ తదితర దేవతలకు మహిళలు తంబిట్టు దీపాలను తలపై మోసుకు వెళ్లి సమర్పించారు.
యువతికి లిఫ్ట్ ఇచ్చాడని దాడి
దొడ్డబళ్లాపురం: తమ వర్గం యువతికి బైక్పై లిఫ్ట్ ఇచ్చాడనే కారణంతో యువకునిపై దాడి చేసిన ఆరుమందిని కలబుర్గి పట్టణ పరిధిలోని ఎంబీ నగర పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 26న తన సహోద్యోగి అయిన ముస్లిం యువతి ఇంటికి వెళ్లడానికి ఆటో దొరకలేదు. దీంతో బైలప్ప ఆమెకు బైక్పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ముస్లిం యువకులు అడ్డగించి బైలప్పపై దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుమందిని అరెస్టు చేశారు.
కారు ఢీకొని
ఇద్దరు రైతుల మృతి
మైసూరు: చామరాజనగర జిల్లా కొల్లేగాళ తాలూకాలోని సత్తెగల్ గ్రామాన్ని కలిసే బైపాస్ రోడ్డులో కారు బైక్ని ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో కారు బోల్తాపడినప్పటికీ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. సత్తెగల్ గ్రామానికి చెందిన నటరాజు (65), మహేష్ మాయప్ప(50), పొలం పని ముగించుకొని ఒకే బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు న్యూఢిల్లీకి చెందినవారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు సత్తెగల్ మీదుగా ఊటీ విహారానికి వెళ్తున్నారు. కారు ఢీకొనడంతో నటరాజు, మాయప్ప తీవ్ర గాయాలై అక్కడే చనిపోయారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటోల అధిక చార్జీలపై
మంత్రి ఆగ్రహం
శివాజీనగర: నగరంలో యాప్ ఆధారిత ఆటోలు సంచరిస్తున్నాయి. ఈ యాప్ ఆధారిత ఆటో డ్రైవర్లు అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి దృష్టికి వచ్చింది. అధిక చార్జీలను వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణ సురక్షిత శాఖ కమిషనర్కు మంత్రి లేఖ రాశారు. బెంగళూరులో ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న యాప్ ఆధారిత ఆటోలు, సాధారణ ఆటోల డ్రైవర్లను వెంటనే కట్టడి చేయాలని ఆదేశించారు. ఆటోల పర్మిట్ను రద్దు చేయటంతో పాటుగా కేసు నమోదు చేయాలని తెలిపారు. అధిక చార్జీల మీద ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు.

అట్టహాసంగా తంబిట్టు