
ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాధికారి ఫౌజియ తరన్నంను నిందించిన విధాన పరిషత్ సభ్యుడు రవికుమార్పై చర్యలు తీసుకోవాలని తెహ్రిక్–ఏ–నిసా మైనార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు రబియా ఖానం మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ ఒక ఉత్తమ జిల్లాధికారిని అవమానించడం తగదన్నారు. బాధ్యుడైన ప్రజాప్రతినిధిపై చర్యలు చేపట్టాలని కోరుతూ పోలీస్ కమిషనర్ శరణప్ప ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
పాఠశాలల మూసివేత సరికాదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. బుధవారం తాలూకాలోని విజయనగర క్యాంప్లో తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేతకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు.
కమల్ వ్యాఖ్యలపై
కరవే ఆందోళన
రాయచూరు రూరల్: తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలను కరవే తీవ్రంగా ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్లో చేపట్టిన ఆందోళనలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూ అతని చిత్రపటానికి పాదరక్షలతో దండించారు. అనంతరం చిత్రపటాన్ని తగలబెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
భారీగా గంజాయి
స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
హుబ్లీ: గబ్బూరు సమీపంలోని కుందగోళ క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బెండిగేరి పోలీసులు, సీసీబీ విభాగం సిబ్బంది సంయుక్తంగా కార్యాచరణ చేపట్టి అరెస్ట్ చేశారు. హావేరికి చెందిన మహమ్మద్ షాహిద్, రెహమాన్ బేగ్, నిసార్ అహమ్మద్ అరెస్ట్ అయిన నిందితులు. వీరి నుంచి రూ.12.64 లక్షలు విలువ చేసే 10.5 కేజీల గంజాయి, మూడు మొబైళ్లు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పునర్వసతి కల్పించాలని డిమాండ్
రాయచూరు రూరల్: హస్మియా కాలనీ వాసులకు పునర్వసతి కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం హస్మియా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ఉన్నఫళంగా వాహనాలతో వచ్చి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వకుండా తొలగించారని ఆరోపించారు. హస్మియా స్థలం వక్ఫ్ బోర్డుది కాదని, ప్రభుత్వ స్థలమని అన్నారు. తమకు ప్రత్యామ్నాయ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
హుబ్లీ: తాలూకాలోని సిరగుప్పి గ్రామం వద్ద హుబ్లీ–గదగ్ హైవే సమీపంలోని డాబా వద్ద టాటా ఏస్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఫలితంగా ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం ఉమచిగి గ్రామానికి చెందిన చంద్రయ్య హుబ్లీమఠ(70) రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతూ మృతి చెందారు. టాటాఏస్ వాహనం డ్రైవర్ సమీర్ ఉదగట్టి తన ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను కేఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి

ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి

ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోండి