
కోవిడ్కు వృద్ధుడు బలి
బనశంకరి: రాష్ట్రంలో కోవిడ్ కలవరం రేపుతోంది. బెంగళూరులో 100 కేసులకు పైగా చేరుకున్నాయి. బెళగావి తాలూకా బెనకనహళ్లి గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు వయోభారంతో అనారోగ్యం బారినపడి బిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వెంటనే కోవిడ్ వార్డులోకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. కాగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు 3కు చేరాయి. కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిసింది. మాస్కుల వాడకం పెరిగింది.
బీజేపీ ఎమ్మెల్సీలపై గవర్నర్కు ఫిర్యాదు
శివాజీనగర: కల్బుర్గి జిల్లాధికారి ఫౌజియా తరున్నుం ని పాకిస్తానీ అని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ దూషించారు. మరో చలవాది నారాయణస్వామి మంత్రి అయిన ప్రియాంక ఖర్గేను కుక్కతో పోల్చారు, వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గురువారం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు, సలీం అహమ్మద్ తదితరులు ఇందులో ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సమాజాన్ని విడగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు.
స్మారకాల సంరక్షణకు రారండి
● సంఘసంస్థలకు పర్యాటక మంత్రి పిలుపు
బనశంకరి: రాష్ట్రంలో చారిత్రక స్థలాలు నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని, రాష్ట్రంలో 25 వేలకు పైగా చారిత్రక స్థలాలను దత్తత ఇవ్వాలని నిర్ణయించామని పర్యాటక మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. బెంగళూరు చిత్రకళా పరిషత్లో నమ్మ ఆర్ట్స్ బెంగళూరు పేరుతో 5 రోజుల పాటు నిర్వహించే జాతీయ కళా ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, మఠాలు, ట్రస్టులు, సంఘసంస్థలు స్మారక దత్తు పథకం కింద స్మారకాలను దత్తత తీసుకోవచ్చునని తెలిపారు. దీంతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్మారకాల రక్షణకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వీలవుతుందన్నారు. చిత్రసంతెను చూస్తే చిత్రకళలో అభిరుచి లేనివారు కూడా ఆశ్చర్యానికి లోను అవుతారని తెలిపారు. కోల్కతా తరువాత కళల పట్ల ఆసక్తి కలిగిన రాజధాని బెంగళూరు కావడం గర్వకారణమన్నారు. ప్రముఖ కళాకారుడు విలాస్నాయక్ గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రకళాపరిషత్ అద్యక్షుడు బీఎల్.శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.25 లక్షలు నిధులు అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిత్రకళావేడుక ఆదివారం వరకు జరుగుతుంది.