
కామ స్వామి మఠం ధ్వంసం
దొడ్డబళ్లాపురం: బాలికపై అత్యాచారం చేసిన దొంగ స్వామికి చెందిన మఠాన్ని అధికారులు జేసీబీలతో ధ్వంసం చేయించారు. బెళగావిలోని రామ మందిరమఠం లోకేశ్వర స్వామీజీ ఒక బాలికకు మాయమాటలు చెప్పి రాయచూరు, బాగలకోటకు తీసుకెళ్లి కొన్ని రోజులపాటు లాడ్జీలలో ఉంచి అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి ఫిర్యాదుచేయగా అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలిసిందే. గురువారంనాడు రాయభాగ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీసులు మేఖళి గ్రామంలో ఉన్న సదరు మఠాన్ని జేసీబీలతో పడగొట్టించారు. 8 ఏళ్ల క్రితం స్వామిజీ 8 ఎకరాలను ఆక్రమించుకుని మఠం నిర్మించాడు. అనుమతులు లేనందున ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
16 మంది రైల్వే
ఉద్యోగులపై కేసు
దొడ్డబళ్లాపురం: తోటి ఉద్యోగిపై హత్యకు కుట్ర చేయడంతోపాటు కుల దూషణ చేశారని ఓ ఉద్యోగి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు 16మంది రైల్వే ఉద్యోగులపై కేసు నమోదైన వ్యవహారం యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని రైల్వే వీల్ ఫ్యాక్టరీలో సీనియర్ మెకానిక్గా పని చేస్తున్న బసవలింగప్ప ఫిర్యాదుదారుడు. వేతనం, ప్రమోషన్ రాకుండా తోటి ఉద్యోగులు 16మంది తనపై హత్యకు కుట్ర చేసి, కుల దూషణతో వేధించారని ఆయన కేసువేశారు. కోర్టు ఆదేశాల మేరకు యలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కూలు బస్సు పల్టీ
దొడ్డబళ్లాపురం: స్కూళ్లు తెరిచిన గురువారంనాడే స్కూల్ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన గదగ్ పట్టణ పరిధిలోని ఆర్కే నగరలో జరిగింది. స్థానిక శ్రీపార్శ్వనాథ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన స్కూల్ ఉదయాన్నే విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తుండగా డ్రైవర్ బ్రిడ్జి కింద నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయపడ్డాడు. పోలీసులు క్రేన్ తెప్పించి బస్సును రోడ్డుపై నుండి తొలగించారు. ఖాళీ బస్సు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
యశవంతపుర: డెత్నోటు రాసి ఇంజినీరింగ్ విద్యా ర్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా హళ్లిగట్టులో జరిగింది. తేజస్విని (19) సీఐటీ కాలేజీలో ఫస్టియర్ బీటెక్ చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటోంది. గురువారం తెల్లవారుజామున గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. డెత్నోటులో 6 విషయాలు తెలిపింది. సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది.
తుపాకుల విక్రేతల అరెస్టు
దొడ్డబళ్లాపురం: నాటు తుపాకులు, రివాల్వర్లు తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్న ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నాటు తుపాకి, ఒక రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు కేజీ హళ్లి రౌడీషీటర్ కాగా మరొకరు ఆయుధాల విక్రేత. అరెస్టయిన రౌడీషీటర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పంజాబ్లోని తేజ్ బహద్దూర్ నగర్లో నివసిస్తున్న ఆయుధాల విక్రేతను అరెస్టు చేసి తీసుకువచ్చారు. తుపాకులను ఎవరెవరికి విక్రయించారు అనేది విచారిస్తున్నారు.
సీఎం, డీసీఎం బదిలీల వార్
బనశంకరి: సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బదిలీల గురించి విభేదాలు వచ్చాయి. ప్రజాపనుల శాఖ నుంచి జలవనరుల శాఖకు సీనియర్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై డీకే శివకుమార్ అసహనం వెలిబుచ్చారు. తమ శాఖలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. దీనిపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. డీకే మీడియాతో మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో ఎక్కువ మంది ఇంజనీర్లు లేరు, మాకు అర్జెంటుగా ఇంజనీర్లు కావాలని అడిగాను. కానీ మా శాఖలోకి వచ్చి పదోన్నతి తీసుకుని ప్రజాపనులశాఖ, జిల్లా పంచాయతీ తో పాటు ఇతర శాఖలకు బదిలీ అవుతున్నారని వాపోయారు. మీ అనుమతి లేకుండా ఎవరు బదిలీచేశారని విలేకరులు ప్రశ్నించగా, ఉన్నతస్థాయిలో జరుగుతోందని పరోక్షంగా సీఎంను ప్రస్తావించారు. నాకు చెప్పకుండా ఎవరినీ బదిలీ చేయరాదని తెలిపానన్నారు.

కామ స్వామి మఠం ధ్వంసం

కామ స్వామి మఠం ధ్వంసం