
గుండెపోటుతో యువతి మృతి
యశవంతపుర: కరోనా వైరస్ ఉత్పన్నమయ్యాక యువతీ యువకులు కూడా గుండెపోటుతో బలవుతున్నారు. ఇదే మాదిరిగా హాసన్ జిల్లా కెలవత్తి గ్రామంలో కవన కె.వి (21) గుండెపోటుతో చనిపోయింది. ఆమె హాసన్ పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. వార్షిక పరీక్షలు జరుగుతుండగా మూడు పరీక్షలను రాసింది. మరో మూడు రాయవలసి ఉంది. బుధవారం సాయంత్రం పరీక్ష రాసి ఇంటికి వెళ్లింది. దాహంగా ఉంది, నీళ్లివ్వాలని తల్లిని అడిగింది. ఆమె ఫిల్టర్ వద్దకెళ్లి నీటిని తీసుకువచ్చేలోపు కవన కుప్పకూలి పడిపోయింది. తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిల్లాలోనే వారం రోజుల కింద సంధ్య అనే విద్యార్థిని కూడా గుండెపోటుతో మరణించింది.