
డిమాండ్ల సాధన కోసం ధర్నా
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపి వేసి మంగళవారం నుంచి నిరవధిక ధర్నాకు దిగినట్లు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ తెలిపారు. ఆయన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని తమ సంఘం ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. తమ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశంలో నిర్ణయించిన విధంగా, ప్రభుత్వానికి గతంలో తెలియజేసినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకం, ఘన వ్యర్థాల నిర్వహణ వాహనాలకు డ్రైవర్ పోస్టుల కేటాయింపు, శాశ్వత అకౌంటెంట్ పోస్టు ఇంకా 19 ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ధర్నాను యథావిధంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్ల సాధన కోసం ధర్నా