
విధానసౌధ గర్వకారణం
బనశంకరి: విధానసౌధ మన రాష్ట్ర ప్రజాప్రభుత్వ జీవితకథ, దీని గురించి ప్రజలకు తెలియజేయడం గర్వపడే కార్యక్రమని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే.పాటిల్ తెలిపారు. ఆదివారం విధానసౌధలో వాకింగ్ గైడెడ్ టూర్ అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా విధానసౌధ ఇకపై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, దూరం నుంచి చూసేబదులు లోపలికి వచ్చి సందర్శించవచ్చని చెప్పారు. ఇది కట్టడం కాదని ప్రపంచంలో అత్యంత సుందరమైన నిర్మాణమని, జూన్ 1 నుంచి పరిమిత రోజుల్లో విధానసౌధను ప్రజల వీక్షించవచ్చని తెలిపారు. ప్రముఖ గైడ్లు విధానసౌధ విశేషాలను పర్యాటకులకు వివరిస్తారని స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. ప్రతి నెలా రెండవ ఆదివారం, నాలుగో శనివారం విధానసౌధ వీక్షణం ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో టికెట్లు రిజర్వు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి, కాంగ్రెస్ నాయకురాలు వసంత కవితారెడ్డి పాల్గొన్నారు.
29 నుంచి
పాఠశాలలు షురూ
శివాజీనగర: వేసవి సెలవుల తరువాత రాష్ట్రంలో మే 29 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ రోజున అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పండుగ మాదిరిగా చేయాలని, విద్యార్థులకు ఘనంగా స్వాగతించాలని విద్యాశాఖ సూచించింది. ఆ రోజు నుంచే అడ్మిషన్లను ఆరంభించి జూన్ 30 కి పూర్తిచేయాలని ఆదేశించింది. తొలి రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారమ్ పంపిణీ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏకరూప విద్యావిధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.