
సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది ఎప్పుడో?
సాక్షి,బళ్లారి: రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే బృహత్ సంకల్పంతో బళ్లారిలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నిధులు పుష్కలంగా ఉన్నా పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆస్పత్రి పనులపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. దాదాపు రూ.400 కోట్లతో బెంగళూరు తరహాలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించేలా నగరంలోని బెళగల్లు రోడ్డులో ట్రామాకేర్ ఆస్పత్రి పక్కనే సువిశాలమైన ప్రదేశంలో 450 పడకలతో 18 సంవత్సరాలు క్రితం బీజేపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి గుండె శస్త్ర చికిత్సలు ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. తొలుత పనులు శరవేగంగా సాగి అనంతరం చతికిలబడ్డాయి. దాదాపు 90 శాతంపైగా పూర్తయిన అనంతరం పనులు ముందుకు సాగలేదు. 2025 సంవత్సరంలోనైనా పూర్తవుతాయో లేదోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి కాస్త పనులు జరుగుతున్నప్పటికీ వైద్య పరికరాలు, వైద్యుల నియామకంపై దృష్టి పెట్టలేదు. జిల్లా ఇన్చార్జ్ ఈ జిల్లా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అభివృద్ధి పనులు మరింత నత్తనడకన సాగుతున్నాయని జనం మండిపడుతున్నారు. డీఎంఎఫ్ నిధులు, కేఎంఆర్సీ నిధులు వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మాణాలు పూర్తి చేస్తే బళ్లారి జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లోని రోగులకు కూడా ఇక్కడ మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరచి నిర్మాణ పనులు ముందుకు సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిధులున్నా పూర్తికాని ఆస్పత్రి పనులు
ప్రభుత్వాలు మారుతున్నా ఉదాసీనతే

సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది ఎప్పుడో?

సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేది ఎప్పుడో?