
సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ కీలకం
హుబ్లీ: సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు ప్రొఫెసర్ బీవై.బండి వడ్డర అన్నారు. ధార్వాడలో కర్ణాటక నీటి పారుదల కార్పొరేషన్ సంస్థ, జల, నేల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యాగారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూములకు సాగునీరు సక్రమంగా అందించడంలో ఇంజినీర్లు ముఖ్య భూమిక పోషించాలన్నారు. జలము, నేల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్.గిరీష్ మరెడ్డి మాట్లాడుతూ మనకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్నారు. మలప్రభ యోజన డివిజన్ ఇంజినీర్ అశోక్ వాసనద, బెళగావి వైద్య విజ్ఞాన సంస్థ పాలనాధికారి డాక్టర్.సిద్దు, సహా సమన్వయ అధికారి చంద్రప్ప హొలేకర, పకీరేశ హగడి, అనురాధ పాల్గొన్నారు.
గుండెపోటుతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
హొసపేటె: గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. బళ్లారి తాలూకా హాలకుంది గ్రామానికి చెందిన దాదాసాహెబ్ (51) హొస్పేట పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు హాజరు కావడానికి స్టేషన్కు వచ్చినప్పుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నేటి నుంచి
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జంట నగరాల మినహాయించి మిగిలిన చోట్ల 200 మీటర్ల మేర ఆవరణ నిర్భంధ ప్రాంతంగా ప్రకటిస్తు జిల్లాధికారి ఆదేశాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం చుట్టూ 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు జారీ చేస్తూ ఆ పరిధిలో జిరాక్స్ అంగళ్లను పరీక్షలు జరిగే రోజులలో బంద్ చేయాలని జిల్లాధికారి దివ్యప్రభు ఓ ప్రకటనలో ఆదేశాలిచ్చారు.
తాళం పగులగొట్టి చోరీ
హుబ్లీ: దొంగలు తాళం పగలగొట్టి నగదు, నగలు చోరీ చేసిన ఘటన మిల్లత్ నగర్లో జరిగింది. శ్యామభాను అనే మహిళ వేరే ఊరికి వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి రూ.60 వేల నగదు, రూ.11 వేల విలువైన నగలు చోరీ చేశారు. బెండిగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మాయమాటలు చెప్పి
లక్షలు కొల్లగొట్టారు
హుబ్లీ: ఇంట్లోనే కూర్చుని చక్కగా రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చునంటు మాయమాటలు చెప్పి రూ.10.97 లక్షలను ఆన్లైన్ కేటుగాళ్లు కొల్లగొట్టారు. హుబ్లీకి చెందిన చెన్నబసవనగౌడ అనే వ్యక్తిని వంచకులు టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదించి షేర్ మార్కెట్ గురించి వివరించారు. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. తొలుత రూ.85 వేల పెట్టుడి పెట్టించారు. అనంతరం దశలవారీగా రూ.10.97 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం నిందితులు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. దీంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి
శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న కర్ణాటక సరిహద్దులోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కళ్యాణదుర్గం పట్టాణానికి చెందిన బోయ శ్రీనివాసులు, బోయ కళ్యాణ్ అనే ఇద్దరు యువకులు పనిపై పొగురున కర్ణాటకకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. సరిహుద్దులోని నందినీ డాబా వద్ద అదుపు తప్పి పడిపోయారు. బలంగా కింద పడడంతో ఇద్దరూ తీవ్ర గాయాలై చనిపోయారని స్థానికులు తెలిపారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి కర్ణాటక పోలీసులకు, కుటుంసభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు పరిశీలించారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ వెళ్లారు.
పంటల దొంగల అరెస్టు
శివమొగ్గ: మూడురోజుల కిందట శిరా కొప్పల్ పోలీస్స్టేషన్ పరిదిలో హనసోగి గ్రామానికి చెందిన గోపాలప్ప, సందీప, శివకుమార్ల పొలాల్లోని 25 క్వింటాళ్ల మొక్కజొన్న పంట అపహరణకు గురైంది. విచారణ చేపట్టిన శికారిపుర డీఎస్పీ కేశవ్, సీఐ సంతోష్, సిబ్బంది హావేరి జిల్లా హీరకరూర్ తాలూకా సీతేకొండ నివాసి నవీణ్(21) రాజేంద్ర (20)ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షల విలువైన మినీ లారీని సీజ్ చేశారు.
పురసభ అప్గ్రేడ్పై హర్షం
మాలూరు: మాలూరు పురసభను నగరసభగా మార్చడానికి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయడంపై పురసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రూపా శశిధర్కు కృతజ్ఞతలు తెలిపారు. పురసభ వ్యాప్తి 712 చదరపు కిమిలు ఉంటుంది. నగరసభ కావడం వల్ల అభివృధ్ది కార్యక్రమాలు మరింత వేగంగా జరుగాతాయని నిధులు ఎక్కువగా అందుతాయన్నారు. పురసభ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కమిషనర్ ప్రసాద్, మాజీ అధ్యక్షురాలు కోమల, స్థాయీ సమితి అధ్యక్షుడు రాజప్ప, పురసభ సభ్యులు పరమేశ్వర్, ఆర్.వెంకటేష్, ఇంతియాజ్, భానుతేజ తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి రంగంలో జలవనరుల నిర్వహణ కీలకం