
మా రిజర్వేషన్లు లాక్కుంటే ఎలా జీవించాలి?
బళ్లారిటౌన్: ఉన్నత వర్గాలైన వీరశైవులు బేడజంగమ పేరుతో ఎస్టీ రిజర్వేషన్లు లాకొంటున్నారని మాజీ మంత్రి హెచ్ ఆంజనేయులు ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బేడ జంగమ సమాజాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్సు చేయాలన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం జంగమ గురువు స్థానంలో ఉందని, వారికి బేడజంగమకు సంబంధం లేదన్నారు. అటువంటి వారు తమ సమాజం రిజర్వేషన్ను లాక్కుంటే ఎలా అన్ని ప్రశ్నించారు. గత ఆగస్టు 1న వర్గీకరణ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ సముదాయానికి కొద్దిగా ఊరట కలిగిందన్నారు. రాష్ట్రంలో జూన్లో ఎస్టీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు కానున్నాయని సిద్దరామయ్య హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగుగాలను భర్తీ చేయరాదని ప్రభుత్వంపై ఒత్తిడి చేసినందున ప్రస్తుతం ఆ ప్రక్రియను స్తంభింపచేసినట్లు తెలిపారు. సమావేశంలో చర్మ పరిశ్రమిక అభివృద్ధి నిగమ అధ్యక్షుడు ముండరిగి నాగరాజు, దళిత సీనియర్ నేతలు కే.మానయ్య, ఎల్ మారెణ్ణ, వెంకటేష్ హెగ్డే, శివరాజ్, యరకులస్వామి, ఫృద్వీరాజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.