
కరువు సీమలో కాసుల గలగల
సాక్షి,బళ్లారి: కృషి, పట్టుదల ఉంటే వ్యవసాయంలో కూడా ఏదైనా సాధించవచ్చనని ఇటీవల పలువురు రైతులు నిరూపిస్తూ పలువురికి మార్గదర్శకులు అవుతున్నారు. సాధారణంగా బాసుమతి వరిని మన దేశంలో పంజాబ్, ఉత్తరాఖండ్, బిహార్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, వెస్ట్రన్ ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణ భారత దేశంలో అరుదుగా బాసుమతి వరిని పండిస్తుంటారు. ఈ బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పలావ్, వెజ్ బిర్యాని, జీరా రైస్, గోబీ రైస్ తదితరాలకు ఎక్కువగా హోటళ్లలో ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఇళ్లలో ఈ బియ్యంతో అన్నం వండేది చాలా తక్కువ. ఎక్కువ బియ్యం రేటుతో ఈ ప్రాంతాల్లో తినడం కూడా తక్కువ. ఈ ప్రాంతాల్లో సోనామసూరి, ఆర్ఎన్ఆర్ తదితర వరిని ఎక్కువగా పండించడం పరిపాటి. అయితే కరువు సీమగా, నీటి సదుపాయం అత్యంత తక్కువ కలిగిన చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకాలో అయితే మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ తదితర పంటలు పండించుకుంటారు. ప్రతి ఏటా ఒకే రకమైన వరితో పాటు జొన్నలు, రాగులు పండిస్తూ కొత్త రకమైన వరిని పండించాలనే ఆలోచన వచ్చిన ఓ రైతు ఈ ప్రాంతానికి అలవాటు కాని బాసుమతి వరిని పండించి శభాష్ అనిపించుకున్నారు.
వాతావరణం కూడా అనుకూలం
కరువు సీమలో కూడా బాసుమతి వరి పండించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని నిరూపించారు. అందులోను రబీ సీజన్లో వరిని పండించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా చిత్రయ్యనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మణ్ పాలెగార్ అనే రైతు తనకు ఉన్న వ్యవసాయ పొలంలో రబీ సీజన్లో బెళగావి నుంచి 30 కేజీల బాసుమతి వరి విత్తనాలను తీసుకుని వచ్చి రెండెకరాల్లో చల్లి, నారు నాటే పద్ధతిలో కూడా వినూత్న తరహాలో బాసుమతిని మొలకలు వచ్చిన తర్వాత నారు పెరిగిన తర్వాత అలాగే పొలంలో వదిలి, కలుపు తీయడంతో పాటు ఎలాంటి రసాయనిక, క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతులతో పాటు పేడ, ఆవుగంజి, వేపనూనె తదితర వాటిని వేస్తూ బాసుమతి వరికి ఎలాంటి చీడపురుగులు ఆశించకుండా క్రమపద్ధతిలో పంటను చూసుకున్నారు. ఈసందర్భంగా రైతు లక్ష్మణ్ పాలెగార్ సాక్షితో మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ప్రాంతంలో పండించే వరినే సాగు చేసేవారమన్నారు. అయితే ఈ ఏడాది బాసుమతి బియ్యం పండించాలనే సంకల్పంతో ప్రయత్నించామన్నారు.
ఇతర రకం వరి మాదిరిగా బాసుమతి సాగు
మన ప్రాంతంలో కూడా ఇతర వరి మాదిరిగా బాసుమతి బియ్యం కూడా పండుతుందన్నారు. ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే ఇతర వరి వంగడాలు ఏవిధంగా పండిస్తారో అదే తరహాలో పండించుకునే అవకాశం ఉందన్నారు. సోనామసూరి తదితర బియ్యాల కంటే బాసుమతి బియ్యం ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారన్నారు. తాము సేంద్రియ పద్ధతిలో బాసుమతి వరిని పండించామన్నారు. విపరీతమైన మందులు వాడటం ద్వారా ఆ బియ్యాన్ని తినడం ద్వారా ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి ఉపయోగించుని, మిగిలిన వరిని పది మందికి మంచి బియ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంలో బాసుమతి వరిని పండించానన్నారు. ఒక ఎకరానికి 35 బస్తాల దిగుబడి లభించిందని, మార్కెట్లో కిలో బాసుమతి బియ్యం ధర రూ.150 నుంచి రూ.180 వరకుఽ పలుకుతుందన్నారు. దీంతో తన పెట్టుబడులు పోను అంతో, ఇంతో లాభం కూడా వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేశారు.
ఒక ఎకరాకు 35 బస్తాల దిగుబడి
రైతుకు లాభాలు కురిపిస్తున్న బాసుమతి
సేంద్రియ పద్ధతిలో వరి పంటను
పండించిన వైనం

కరువు సీమలో కాసుల గలగల