
వాడవాడలా సింధూర్ సంబరాలు
శివాజీనగర: ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ మీద భారతదేశం సైనిక దాడులు చేపట్టడంతో అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆపరేషన్ సింధూర్ మీద సంతోషం వ్యక్తంచేస్తూ ర్యాలీలు నిర్వహించారు. హుబ్లీ, ధారవాడ, బెళగావి, బెంగళూరుతో పాటు అనేక జిల్లాల్లో ప్రజలు, హిందూ సంఘాలు సంబరాలలో పాల్గొన్నారు. జెండాలను పట్టుకుని నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచారు. హుబ్లీలో శ్రీరామ సేన నేత ప్రమోద్ ముతాలిక్ ర్యాలీ జరిపారు. పాపి పాకిస్తాన్కు మద్దతునిచ్చేవారికి బుద్ధి చెప్పాలన్నారు. వారికి సత్తా చూపిస్తామని అన్నారు.
సీఎం కుంకుమ ధారణ
జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. సింధూర్ దాడికి మద్దతు పలుకుతున్నామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, భారతీయ సైన్యం శ్లాఘనీయమైన కార్యాన్ని చేపట్టిందని, కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం నుదుటన ఎర్ర కుంకుమ పెట్టుకుని రావడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని దేవదాయ మంత్రి రామలింగారెడ్డి అధికారులకు సూచించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అందరు మంత్రులు, బీజేపీ నాయకులు సింధూర్ను కీర్తిస్తూ ప్రకటనలు చేశారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు చేశారు.
పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని డిమాండ్లు
సీఎం సహా నేతలందరి హర్షం