
రోజు ఏడు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు
హుబ్లీ: గ్రామానికి బస్సు సౌకర్యం లేకున్నా రోజు ఇంటి నుంచి పాఠశాలకు 7 కిలోమీటర్లు కాలి నడనకన వెళ్లి చదువుకున్న విద్యార్థిని 10వ తరగతిలో 625కు గాను 615 మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. కార్వార సమీపంలోని శిరసి తాలూకాలోని సాల్కని గ్రామ పంచాయతీ పరిధిలో నీల్కణి గ్రామం నివాసి మానస నాగేష్గౌడ.. ఏడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీనరసమ్మ హైస్కూల్లో చదివింది. బస్సు సదుపాయం లేకపోవడంతో ఉదయం 6.30 గంటలకే బయల్దేరి తిరిగి సాయంత్రం 7.30 గంటలకు ఇంటికి చేరుకునేది. దీంతో చదువుకునేందుకు తగిన సమయం దొరికేది కాదు. అయినా రాత్రి 1 గంట దాకా చదువుకునేది. కొన్ని సార్లు ఉదయం 4 గంటలకే లేచి చదువుకునేది. ఎవరి వద్దకు ట్యూషన్కు వెళ్లలేదు. ఆమె పడిన కష్టానికి కన్నడ, హిందీ బాషలలో పూర్తి మార్కులను సాధించారు. ఇంగ్లిష్లో –2, గణితంలో –2, సాంఘిక శాస్త్రంలో–1, సైన్స్లో –5 మార్కులు మాత్రమే తక్కువగా తెచ్చుకుంది.
జిల్లా అధికారి కావాలన్నదే ధ్యేయం
మానస మీడియాతో మాట్లాడుతూ పీయూసీలో సైన్స్ విభాగంలో చదవాలనుకుంటున్నానని, జిల్లాధికారి కావాలన్నదే తన లక్ష్యమని వివరించారు. మానస తండ్రి నాగేష్మంజ్యాగౌడ మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో తన కుమార్తె ప్రతిభ చూపడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు చదువును మద్యలోనే మానివేశారని ఇప్పటికై ప్రభుత్వం మేలుకొని విద్యార్థుల చదువుకు ప్రొత్సాహం అందించేలా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పది పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ
సాధించిన శిరసి మానస