
శాకంబరిగా బనశంకరీదేవి
బనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దేవత బనశంకరీదేవి శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీ మాతకు అభిషేకం, అర్చన చేపట్టారు. అనంతరం మూలవిరాట్ను వివిధ కాయగూరలతో అలంకరణచేపట్టి విశేషపూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. భక్తులు బనశంకరీదేవికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్తప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు.
కులగణనపై రెండేళ్ల క్రితమే లేఖ రాశా
శివాజీనగర: జన గణన, కుల గణనకు కాలపరిమితిని నిర్ధారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితమే జనగణనతో పాటు కుల గణన జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. అప్పట్లో నిరాకరించిన కేంద్రం ప్రస్తుతం కులగణనకు ముందుకు వచ్చిందన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు. అయితే జవహర్లాల్ నెహ్రూ కుల గణనను వ్యతిరేకించినట్లు బీజేపీ నేతలు అనవసరంగా వ్యాఖ్యలు చేయరాదన్నారు. జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటినుంచి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే వచ్చాయన్నారు.
బాలికపై లైంగిక దాడి
దొడ్డబళ్లాపురం: ప్రేమ పేరుతో బాలికపై యువకుడు అత్యాచారం జరపగా మరో యువకుడు సైతం బాధితురాలిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన గదగ్లో వెలుగు చూసింది. జిల్లా ఎస్పీ నేమగౌడ తెలిపిన వివరాల మేరకు...గత నెల 19న సమీర్ అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి స్థానిక లాడ్జ్కు తీసికెళ్లి అత్యాచారం జరిపాడు. తరువాత సమీర్ తన స్నేహితుడు ఉమర్ను తీసికెళ్లి అత్యాచారం చేయించాడు. వీరిలో జాకీర్ హుసేన్ అనే మరో యువకుడు లాడ్జ్లో రూం తీసుకోవడానికి సహకరించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
దారి మధ్యలో బస్సు నిలిపి నమాజ్
దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ బస్సును దారి మధ్యలో నిలిపి నమాజ్ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించినట్లు ఆరోపిస్తూ అధికారులు ఆ డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఏఆర్ ముల్లా అనే డ్రైవర్ హానగల్ నుంచి విశాలగడకు బస్సును తీసుకెళ్తూ దారి మధ్యలో బస్సు బస్సు నిలిపి సీట్లో నమాజ్ చేశాడు. ఈ దృశ్యాన్ని ఒక ప్రయాణి కుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. డ్రైవర్ చర్యలకు నెటిజన్లు తూర్పారబట్టారు. స్పందించిన అధికారులు ముల్లాను సస్పెండ్ చేశారు.
దుండగుల హల్చల్
కృష్ణరాజపురం : బెంగళూరు నగరంలోని విద్యారణ్యపురంలో దుండగులు హల్చల్ చేశారు. మధు అనే వ్యక్తికి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యాలయంపై రాత్రి సమయంలో దాడి చేశారు. మాస్కు ధరించిన సుమారు ఏడుమంది దుండగులు కార్యాలయ షెట్టర్ తొలగించి అందులోని వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై బాధితుడు గురువారం విద్యారణ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శాకంబరిగా బనశంకరీదేవి