
పాత్రికేయుడిపై దాడి.. అధికారిపై వేటు
రాయచూరు రూరల్: రెండు రోజుల క్రితం రాత్రి వేళ అటవీ శాఖ అధికారి పాత్రికేయుడిపై దాడి చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన ఉదంతంపై అధికారిని సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి బీదర్లో పని మీద వెళుతుండగా రహదారిపై గస్తీలో ఉన్న అటవీ శాఖ అదికారి దస్తగిరిసాబ్ ప్రజలతో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన విలేఖరి రవి బసవరాజ్పై అధికారి ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి దస్తగిరిసాబ్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
డివైడర్ను ఢీకొని బైక్ చోదకుడు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణం కొట్టూరు రోడ్డులోని నీలగుంద గ్రామంలో బైక్ చోదకుడు డివైడర్ను ఢీకొట్టడంతో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడిని కూడ్లిగి పట్టణంలోని బాపూజీ నగర్ నివాసి ఓబలేష్(24)గా గుర్తించారు. బైక్ చోదకుడు ఓబలేష్ తన బైక్లో పెట్రోల్ నింపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని, కూడ్లిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
మైనర్పై అత్యాచారం.. ఒకరు అరెస్ట్
హుబ్లీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ధార్వాడ తాలూకా అళ్నావర పోలీసులు అరెస్ట్ చేశారు. అళ్నావర తాలూకా కుంబారకొప్ప గ్రామ నివాసి సంజయ్ మేవుండి(22) అనే నిందితుడు మైనర్ బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో బాధితురాలు ప్రస్తుతం గర్భవతి అయింది. కాగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు డీఎస్పీ నాగరాజ్ తెలిపారు.
యువయాన్కు శ్రీకారం
రాయచూరు రూరల్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ పరిరక్షణ కోసం యువయాన్కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన యువయాన్లో కార్యదర్శి కొప్పర శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ అంశాల్లో రాజ్యాంగాన్ని నానా విధాలుగా వక్రీకరించడాన్ని ఖండించారు. దేశం కోసం సమర్పించిన రాజ్యాంగాన్ని విభజించడానికి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు.
రాహుల్, సోనియా
రాజీనామా చేయాలి
● బీజేపీ యువ మోర్ఛా నిరసన
హొసపేటె: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక అవినీతి కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్ఛా కాంగ్రెస్కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. హొసపేటె కార్యాలయం నుండి వారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలను పట్టుకుని పునీత్రాజ్కుమార్ సర్కిల్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. బీజేపీ యువ మోర్ఛా నేత కిచిడి కొట్రేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందన్నారు. అందువల్ల నాయకులు ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారన్నారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పాత్రికేయుడిపై దాడి.. అధికారిపై వేటు

పాత్రికేయుడిపై దాడి.. అధికారిపై వేటు

పాత్రికేయుడిపై దాడి.. అధికారిపై వేటు