
గుజరాత్ కంపెనీకి టీబీ డ్యాం గేటు నిర్మాణ బాధ్యత
హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్లాగ్ గేట్ను తొలగించి శాశ్వత క్రస్ట్గేట్ను నిర్మించడానికి గుజరాత్కు చెందిన ఒక కంపెనీ టెండర్ దక్కించుకొందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ టెండర్ను దక్కించుకుందని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ గతంలో మైసూరులోని కేఆర్ఎస్ ఆనకట్ట గేట్లను కూడా నిర్మించిందన్నారు. తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ వద్ద స్టాప్లాగ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్యాం గేటు నిర్మించడంలో అనుభవం కలిగిన ఈ హార్డ్వేర్ టూల్స్ మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీ త్వరలో తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ను నిర్మించే పనులను ప్రారంభిస్తుందన్నారు. గత ఏడాది ఆగస్టు 10న 19వ నంబర్ గేట్ ప్రవాహ తీవ్రతకు ఊడి పోయి నీటిలో కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. అనంతరం డ్యాంలో ఉన్న నీటిని కాపాడేందుకు ఒక తాత్కాలిక స్టాప్ లాగ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ గేటు కూలి పోవడంతో సుమారు 40 టీఎంసీలకు పైగా వరకు నీరు వ్యర్థంగా నదిలోకి విడుదలైంది. తరువాత నిపుణుడు కన్హయ్య నాయుడు నాయకత్వంలో ఒక స్టాప్లాగ్ నిర్మించారు. ఇప్పుడు గేటుకు శాశ్వత గేటు నిర్మాణ టెండర్కు చర్యలు చేపట్టారన్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన 32 క్రస్ట్ గేట్లను నిర్మాణం చేయడానికి తుంగభద్ర బోర్డు ఈ–టెండర్లను కూడా పిలవనుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి.
ఒకటి రెండు రోజుల్లో శాశ్వత గేటు నిర్మాణ పనులకు శ్రీకారం
32 క్రస్ట్గేట్ల నిర్మాణ పనులకు ఈ–టెండర్ల పిలుపునకు సన్నాహాలు