
అలరించిన కరగ ఉత్సవం
కోలారు : నగరంలోని కారంజికట్ట శ్రీధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవం గురువారం రాత్రి అపార భక్త సమూహం నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. కరగ పూజారి నాగరాజ్ కుమారుడు మునిరాజు కరగ తలపై మోసుకుని చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన కారంజికట్ట కరగ ఉత్సవాన్ని చూడడానికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. చాలా ఏళ్లుగా కరగను మోస్తూ వచ్చిన బేతమంగల నాగరాజ్ వయసు మళ్లిన కారణంగా ఆయన కుమారుడు మునిరాజు కరగను తలపై మోసే బాధ్యతను తీసుకున్నారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య మునిరాజు నిర్వహించిన కరగ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ద్రౌపతాంబ దేవి ఆలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసుపు వస్త్రాలను ధరించిన కరగ పూజారి కరగను భక్తితో తలపై మోసుకుని వేదికపై నృత్యం చేశారు. కరగ సందర్భంగా ఆలయాన్ని, కారంజికట్ట ప్రాంతం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కరగ ఉత్సవంలో వీర కుమారుల గోవిందనామ స్మరణ మారుమోగింది. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ, అనిల్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని కరగ ఉత్సవాన్ని వీక్షించారు.