
క్రీడలతో శారీరక ఆరోగ్యం
కోలారు : యువత క్రీడల్లో విరివిగా పాల్గొనడం ద్వారా శారీరకంగా, మానసికంగా సధృఢంగా ఉండడానికి సాధ్యమని కోముల్ మాజీ డైరెక్టర్ డీవీ హరీష్ తెలిపారు. శుక్రవారం తాలూకాలోని తంబిహళ్లి గేట్లో పాలార్ క్రికెట్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హుత్తూరు పంచాయతీ ప్రీమియర్ లీగ్ సీజన్– 2 క్రికెట్ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలను నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించవచ్చన్నారు. వారిని తగిన విధంగా ప్రోత్సహించడం ద్వారా గొప్ప క్రీడాకారులను చేయవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. వచ్చే సంవత్సరం మరిన్ని జట్లను చేర్చి క్రికెట్ పోటీలను నిర్వహిస్తామన్నారు. టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు వడగూరు వి.రాము, కురుబర సంఘం మాజీ అధ్యక్షుడు తంబిహళ్లి మునియప్ప, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.