
పాల డైరీ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలి
హొసపేటె: పాల డైరీ ప్రధాన కార్యాలయాన్ని బళ్లారి నుంచి విజయనగర జిల్లా కేంద్రం హొసపేటెకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆల్ కర్ణాటక స్టేట్ కిసాన్ జాగృతి సంఘం ఆధ్వర్యంలో గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. బసవేశ్వర సర్కిల్ నుంచి ప్రారంభించి సాయిబాబా సర్కిల్ గుండా కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ కక్కుప్పి మాట్లాడుతూ మిల్క్ డైరీ కేంద్ర కార్యాలయం బళ్లారిలో ఉండటంతో బోర్డు డైరెక్టర్ల సమావేశాలకు కూడా అంతరాయం కలిగిందన్నారు. కేంద్ర సంఘం డైరెక్టర్ హెచ్.మరుళసిద్దప్ప మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ విజయనగర, కొప్పళ, రాయచూరు, బళ్లారి జిల్లాల అధికార పరిధికి పరిమితం అయినా అతి పెద్ద సహకారం విజయనగర జిల్లాకే దక్కిందన్నారు. వెంటనే మిల్క్ డైరీ కేంద్రాన్ని బళ్లారి నుంచి హొసపేటెకు మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందించారు. సంఘం పెద్దలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.