
నేషనల్ హెరాల్డ్ కేసు కుట్రపూరితం
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశ్యంతో కుట్రపూరితంగా నేషనల్ హెరాల్డ్పై కేసు నమోదు చేసిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. బుధవారం కలబుర్గిలో ఉద్యోగ మేళాలో పాల్గొని ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెట్టడం, వారి ఆస్తులను అటాచ్ చేయడం, చార్జిషీట్లు వేయడం వంటి వాటికి ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రంలో కులగణనను నిరసిస్తూ లింగాయతులు, ఒక్కలిగులు రాజీనామా చేస్తారనే అంశంపై సీఎం స్పందిస్తూ గురువారం బెంగళూరులో మంత్రివర్గ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలు సేకరించి, చర్చ జరుపుతామన్నారు. యువనిధి పథకంలో 80 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆశయంతో బెంగళూరు, కలబుర్గిలో ఉద్యోగ మేళాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో హుబ్లీ–ధార్వాడ, మైసూరుల్లో కూడా మేళాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, ఖనీజా ఫాతిమా, శరణ బసప్ప దర్శనాపూర్, రామలింగారెడ్డి, అజయ్సింగ్లున్నారు. ఉద్యోగ మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. కలబుర్గి నగరంలోని కే–సీఈటీ మైదానంలో జరిగిన మేళాలో 5000 మంది నిరుద్యోగులున్నారు.
సోనియా, రాహుల్లను ఇబ్బంది పెట్టేందుకే
కలబుర్గిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపణ
యువనిధి పథకంలో 80 వేల మంది పేర్ల నమోదు