హుబ్లీ: ఎప్పటికీ మరణం లేని కళలు, సాహిత్యం, సంగీతం, నృత్య కళలు మాత్రమే మనిషి మనస్సును వికసింపజేస్తాయని, ఈక్రమంలో ఫ్రెండ్స్ సోషల్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని కర్ణాటక బాల వికాస అకాడమి అధ్యక్షులు సంగమేశ బబలేశ్వర అన్నారు. ఆలూరు వెంకటరావ్ భవన్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రతిభోత్సవం, సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భారతీయ మాతృమూర్తి తన మొత్తం జీవితాన్ని పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం అంకితం చేసే త్యాగం ప్రపంచంలోని నోబుల్ బహుమతి కన్నా పెద్దదన్నారు. అలాంటి తల్లి స్వరూపమైన మహిళలను మనం విశ్వమహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం భారతీయ తల్లులకు ఇచ్చే గౌరవం అన్నారు. బీఆర్టీఎస్ ఎండీ సావిత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. మనం నేడు పిల్లలను పోషించడంలో సమాజం తీరు మారాలన్నారు. అనంతరం మహిళా సాధకులను ఘనంగా సన్మానించారు. సీనియర్ నటుడు, డైరెక్టర్ శశిధర్ నరేంద్ర, సవితా అమరశెట్టి, ప్రకాష్ బాళెకాయి, వినోద్ కుసుగల్, డాక్టర్ పూర్ణిమా ముక్కుంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జగద్గురు
చంద్రశేఖర జయంతి
హుబ్లీ: నాగశెట్టికొప్పలోని శ్రీశాండిల్య ఆశ్రమంలో సద్గురు చంద్రశేఖర స్వామి 90వ జయంతి ఉత్సవాలు, బగళాంబ మహిళా మండలి 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచల సాధు సంస్థాన మఠం జగద్గురు డాక్టర్ శివానంద భారతీ సాన్నిధ్యం వహించారు. సవదత్తి తాలూకా హళకట్టి శివానంద మఠం నిజగుణ స్వామి మాట్లాడుతూ అనుపమాచల భక్తి భావన శంభులింగ అనే విషయంపై ప్రవచనం చేశారు. జగాపుర కమ్మలవ్వ హళేమని చంద్రశేఖర్ స్వామి మూర్తికి తులాభారం నెరవేర్చారు. బెనకట్టి మల్లమాంబ భజన మండలి బృందం భజన గీతాలు ఆలపించారు. నాగశెట్టి కొప్ప, బెంగేరి, గోపనకొప్ప తదితర గ్రామస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు.
31న చదరంగం పోటీలు
హుబ్లీ: విద్యానగర్ రోటరీ భవన్లో ఈ నెల 31న ఉదయం 9.30 గంటలకు జద్గురు స్మార్ట్ అండ్ మ్యూజిక్ అకాడమి, రోటరీ క్లబ్ హుబ్లీ నార్త్ సహకారంతో 17 ఏళ్ల లోపు వయస్సుగల పిల్లలకు చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలను రామకృష్ణ వివేకానంద ఆశ్రమం తేజసానంద స్వామీజీ ప్రారంభించనున్నారు. పోటీల విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షక ట్రోఫిలు, మెడల్స్ ఇవ్వనున్నారు. సంస్థ అధ్యక్షురాలు అర్చన నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగేష్ రిత్తి తదితరులు పాల్గొననున్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 28 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, 8431737265 నెంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు.
పెంచిన వేతనాలు చెల్లించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పెంచిన వేతనాలను త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు ఈరమ్మ మాట్లాడారు. బెంగళూరు ఫ్రీడం పార్కులో గత జనవరి 7 నుంచి నిరవధిక దర్నాకు పూనుకోవడంతో ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెంచిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచి అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
క్షయపై జాగృతి జాతాకు శ్రీకారం
రాయచూరు రూరల్ : సభ్య సమాజంలో క్షయ వ్యాధిగ్రస్తులను ప్రజలు దూరంగా ఉంచుతారని, క్షయ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధి పూర్తి నియంత్రణలోకి తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరూ క్షయ వ్యాధి నుంచి మరణిస్తున్నారన్నారు. వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్స పొందాలన్నారు. జాతాథాలో వైద్యాధికారులు గణేష్, షాకీర్, నందిత, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులున్నారు.
సజావుగా గణితం పరీక్షలు
కోలారు: జిల్లాలో 65 పరీక్ష కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 355 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,219 మంది విద్యార్థులకు గాను 16,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించినట్లు డీఈఓ కృష్ణమూర్తి తెలిపారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓతో పాటు సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తదితర అధికారులు తనిఖీ చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తుండడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
మహిళా సాధకులకు ఘన సన్మానం