శివాజీనగర: రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ కొరత ఏర్పడలేదు. అయితే వేసవి నేపథ్యంలో మామూలు కంటే విద్యుత్ను అదనంగా ప్రజలు ఉపయోగించారని కేపీటీసీఎల్ ఎండీ కుమార్ పాండే తెలిపారు. సోమవారం నగరంలో బెస్కాం బెళకు భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత 6 నెలల నుంచి విద్యుత్ వాడకం అధికమైంది. వేసవి కారణాన ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో ఏసీ వినియోగం పెరిగింది. డిమాండు నేపథ్యంలో పంజాబ్ , యూపీ ద్వారా విద్యుత్ను కొంటున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 17,220 మెగావాట్లు ఉండేది, ఈ ఏడాది 18,500 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈసారి విద్యుత్ వాడకం 15 శాతం అధికమైందన్నారు. ఏప్రిల్, మేలో మరింత పెరుగుతుందని తెలిపారు. ఇళ్లు, పరిశ్రమల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉందని చెప్పారు. సరఫరా కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ చాలా ఉంది, సోలార్ కరెంటు వినియోగం పెరుగుతోంది, ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడాలని సూచించారు.
రోజూ వేలాది మెగావాట్ల వినియోగం
కొరత లేకుండా చర్యలు: ఇంధనశాఖ