మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని దేవిపుర గ్రామంలో వెలసిన హిరియమ్మ దేవి, దొడ్డహబ్బ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనేశ్వర స్వామి, శ్రీరామాంజనేయ స్వాములకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వాములను అలంకరించి ఊరేగించారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
తల్లీబిడ్డ మృతి, ఆస్పత్రిపై దాడి
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని ప్రైవేటు ఆస్పత్రిలో తల్లీ బిడ్డ మృతిచెందడంతో సిబ్బందే కారణంటూ బంధువులు దాడికి దిగారు. ఎంఎస్కే మిల్ కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో సభా పర్వీన్ అనే గర్భిణికి ఆదివారం రాత్రి కాన్పు జరిగింది. కొన్ని గంటల్లోనే తల్లీ బిడ్డ కన్నుమూశారు. దీంతో భర్త, బంధువులు ఆగ్రహం పట్టలేక కిటికీల అద్దాలను పగలగొట్టారు. కుర్చీలు టేబుళ్లను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. వైద్యులు మాట్లాడుతూ గర్భంలోనే శిశువు చనిపోయిందని, లోబీపీ కారణంగా తల్లి కూడా మరణించిందని తెలిపారు.
తిరుమలకు పాదయాత్ర
బనశంకరి: రాజానుకుంటె చల్లహళ్లి కి చెందిన వెంకన్న భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ దఫా కూడా 14వ సారి పాదయాత్ర చేసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. 25 మంది పాదయాత్రలో పాల్గొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నడక ప్రారంభించి మధ్యలో ఏదైనా ఆలయం వద్ద విశ్రాంతి తీసుకుంటారు. తిరుమలకు చేరడానికి 6 రోజులు పట్టిందని తెలిపారు. మండుటెండను లెక్కచేయకుండా పాదయాత్ర చేశామని, మధ్యలో ప్రజలు ఎంతో సహకారం అందించారని భక్తుడు చేతన్ చెప్పారు.
సీతారాముల కళ్యాణం
మైసూరు: మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకాలోని చరిత్ర ప్రసిద్ధ చుంచనకట్టె శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధర్మస్థల ట్రస్టు ద్వారా సీతారాముల వారి కళ్యాణోత్సవం, అఖండ రామకోటి భజన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మూలవిరాట్కు కొబ్బరినీళ్లు, వివిధ ద్రవ్యాలతో అభి షేకం నిర్వహించారు. వందలాది భక్తుల సమక్షంలో మహామంగళహారతి ఇచ్చి, స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిటీ బస్సుల కోసం రిపేరీ వ్యాన్లు
బనశంకరి: ఆర్టీసీ బస్సులు సజావుగా నడవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బీఎంటీసీ బస్సులు రోడ్డుపై మొరాయిస్తే తక్షణం మరమ్మతులు చేయడానికి 5 మొబైల్ రిపేర్ వ్యాన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. 6,835 బస్సులు బీఎంటీసీ నగర, ఉపనగరాలలో ప్రతిరోజు సరాసరి 5,875 ట్రిప్పులు సంచరిస్తాయన్నారు. ట్రాఫిక్ రద్దీలో బ్రేక్డౌన్ అవుతున్నాయి, దీంతో బస్ టెర్మినల్స్లో కనీసం ఒక మొబైల్ రిపేర్ వ్యాన్ ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వాహనంలో హెవీ టూల్బాక్స్లు, బ్యాటరీలు, టైర్లు, హైడ్రాలిక్ జాక్లు, కేబుల్స్, ఇతర మరమ్మత్తు పరికరాలు ఉంటాయని తెలిపారు.
క్షయను నిర్మూలిద్దాం
తుమకూరు: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం తుమకూరు జిల్లా పాలనా యంత్రాంగం ద్వారా నగరంలో జన జాగృతి జాతాను నిర్వహించారు. ఎవరూ కూడ క్షయను తెచ్చుకోవద్దని, దానిని పూర్తిగా నిర్మూలించాలని నినాదాలు చేశారు. ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
దొడ్డహబ్బ వేడుకలు
దొడ్డహబ్బ వేడుకలు
దొడ్డహబ్బ వేడుకలు
దొడ్డహబ్బ వేడుకలు