పళ్లు లేవని.. యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పళ్లు లేవని.. యువకుడు ఆత్మహత్య

Mar 24 2025 5:59 AM | Updated on Mar 24 2025 5:58 AM

దొడ్డబళ్లాపురం: ఓ యాక్సిడెంటు యువకుని ఆత్మహత్యకు కారణమైంది. ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి, సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగాలి అనే బాధతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. కొప్ప తాలూకా సాలుమర గ్రామంలో విఘ్నేష్‌ (18) అనే యువకుడు స్థానిక ఐటీఐలో ఫస్టియర్‌ చదివేవాడు. నాలుగేళ్ల క్రితం బైక్‌ ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి. పళ్లు కట్టించుకోవాలని ఆ రోజు నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ చాలా ఖర్చు చేశాడు. నీకు పళ్లు లేవని అందరూ ఎగతాళి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ముత్యాలమ్మకు విశేష పూజలు

మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలోని పురాతన శ్రీ ముత్యాలమ్మ దేవి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు కోడూరు మదన్‌ నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, వేద, మంత్ర పారాయణం, తదితరాలను చేపట్టారు. లక్కూరు ఫిర్కాతో పాటు తాలూకాలోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు.

సిద్దు ఇంటికి ఖర్గే

హనీ ట్రాప్‌పై చర్చ?

శివాజీనగర: రాష్ట్రంలో కొందరు మంత్రులు, నాయకులపై హనీట్రాప్‌ ప్రయోగం జరుగుతోందనే హంగామా నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆదివారం బెంగళూరులోని కావేరి నివాసంలో సీఎం సిద్దరామయ్యను మల్లికార్జున ఖర్గే, మంత్రి ప్రియాంక ఖర్గే వచ్చి కలిశారు. పార్టీ అధ్యక్షుడే సీఎం ఇంటికి రావడం బట్టి విషయం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. హనీట్రాప్‌లో బాధితులు, సూత్రధారులు ఎవరు, ఎందుకు చేశారు, పార్టీ, ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోవాలనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. హనీ ట్రాప్‌ కేసులో తమ పార్టీవారు, ప్రతిపక్ష పార్టీవారు ఎవరు పాల్గొన్నా కూడా వారి మీద చర్యలు తీసుకొంటాం. శాసనసభలో మంత్రే ఈ వ్యవహారం గురించి గళమెత్తినప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉండదు. ఈ కేసు గురించి విచారణ చేపడతాం. ప్రతిపక్ష పార్టీల వారు న్యాయ విచారణను కోరారు. అన్నింటి గురించి హోం మంత్రితో సీనియర్‌ మంత్రులతో చర్చించి, ఈ విధమైన తనిఖీ చేపట్టాలనేది నిర్ధారిస్తామని సిద్దరామయ్య గతంలోనే తెలిపారు.

సీఎంను ఎవరో కలిస్తే ఏమిటి?

డీసీఎం శివకుమార్‌ రుసరుస

శివాజీనగర: ముఖ్యమంత్రిని ఎవరైనా భేటీ చేయవచ్చు. ఆయనను ఎవరు కలిశారనేది నన్నెందుకు అడుగుతున్నారు? అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, మంత్రి రాజణ్ణ సీఎంను కలవడంపై విలేకరులు ప్రశ్నించగా ఇలా స్పందించారు. నా శాఖ విషయాల గురించి మాత్రమే నన్ను అడగండి. శాసనసభలో హనీ ట్రాప్‌ గురించి మాట్లాడినందుకు మంత్రిపై హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిందా? అన్న ప్రశ్నకు అంతా బోగస్‌ అన్నారు.

దక్షిణాది స్వాభిమానం కోసం పోరాటం

శనివారం తమిళనాడు చైన్నెలో జరిగిన సీఎంల సభలో పాల్గొన్నాను, దక్షిణ భారత దేశంలో ఎంపీ నియోజకవర్గాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన అన్ని విషయాలను సమావేశంలో ప్రస్తావించాను. కర్ణాటకలో 2 సీట్ల తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. దీని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇది మా రాష్ట్ర, దక్షిణ భారతదేశ స్వాభిమాన అంశమని తెలిపారు.

వివాదంలో దర్శన్‌

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి ఇటీవల బెయిలుపొందిన ప్రముఖ నటుడు దర్శన్‌ కేరళలో ఆలయాలను దర్శించుకుంటున్నారు. కణ్ణూరు మాడాయికావు శ్రీ భగవతి దేవాలయంలో శత్రుసంహార పూజలు చేయించారు. అంతాబాగానే ఉంది కానీ, ప్రజ్వల్‌ రై అనే వ్యక్తి దర్శన్‌ వెంట ఉండడం చర్చనీయాంశమైంది. ప్రజ్వల్‌ రై 2017లో గ్రామపంచాయతీ సభ్యుడు కరోపాడి హత్య కేసులో ముఖ్య నిందితుడు. ఇప్పుడు దర్శన్‌ వెంట కనిపించడంతో విమర్శలకు తావిచ్చింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అలాంటి వ్యక్తితో పనేముందని కొందరు వ్యాఖ్యానించారు.

పళ్లు లేవని..  యువకుడు ఆత్మహత్య 1
1/1

పళ్లు లేవని.. యువకుడు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement