బొమ్మనహళ్ళి: భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్న ఊరి జాతరలో విషాదం సంభవించింది. ఆకాశాన్నంటే రెండు తేర్లు పెనుగాలులకు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన శనివారం సాయంత్రం బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలో ఉన్న చరిత్ర ప్రసిద్ది చెందిన హుస్కూరు మద్దూరమ్మదేవి జాతరలో చోటుచేసుకుంది. ఇద్దరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు.
దొడ్డనాగమంగల తేరు..
ఈ ఏడాది మద్దూరమ్మ జాతరకు పరిసర గ్రామాల నుంచి మొత్తం ఆరు తేరులు రావాల్సి ఉంది. తమ ఊరి రథమే బ్రహ్మాండంగా ఉండాలనే తపనతో గ్రామస్తులు పోటీ పడి చాలా ఎత్తుగా తేరును నిర్మిస్తూ ఉంటారు. దీనికోసం లక్షల రూపాయలను వెచ్చిస్తారు. ఇందులో దొడ్డనాగమంగల తేరు 150 అడుగుల ఎత్తు ఉంది. చిక్కనాగమంగళ వద్దకు చేరుకోగానే గాలి దుమారం లేచింది, ఓ వైపు కుప్పకూలిపోయింది. ఇందులో ఎవరికీ ఏమీ కాలేదు.
రాయసంద్ర రథంలో విషాదం
ఇక రాయసంద్ర నుంచి వస్తున్న 120 అడుగుల రథం కూడా ఇదే మాదిరిగా కుప్పకూలింది. రథం కింద కొందరు చిక్కుకుపోయారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన రోహిత్ (26), బెంగళూరు కెంగేరికి చెందిన బాలిక జ్యోతి (14) చనిపోయారు. నలుగురుకి పైగా గాయపడ్డారు. రథం కళ్లముందే కూలిపోవడంతో భక్తుల హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 2024 జాతరలోనూ రాయసంద్ర నుంచి వచ్చిన తేరు పడిపోయింది. భక్తులు, పరిసర గ్రామాలవాసులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఆనేకల్ హుస్కూరమ్మ జాతరలో
అపశ్రుతి
రెండు తేర్లు కూలి ఇద్దరు దుర్మరణం
పలువురికి గాయాలు
ఆకాశ రథాలు.. అంతలోనే పతనం
ఆకాశ రథాలు.. అంతలోనే పతనం