ఆక్రమణల తొలగింపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

Mar 24 2025 5:51 AM | Updated on Mar 24 2025 5:52 AM

రాయచూరురూరల్‌: నగరంలో ఆక్రమణల తొలగించేందుకు చర్యలు చేపడుతామని కార్పొరేషన్‌ కమిషనర్‌ జుబిన్‌ మోహోపాత్రే తెలిపారు. శనివారం ఆయన ఎస్పీ పుట్ట మాదయ్యతో కలిసి నగరంలో పర్యటించారు. తీన్‌ కందిల్‌, మహవీర్‌ సర్కిల్‌, స్టేషన్‌ రహదారి, అంబేడ్కర్‌ సర్కిల్‌, షరాప్‌ బజార్‌, ఉస్మానియా మార్కెట్‌, పటేల్‌ రహదారి, సిటీ టాకీస్‌ రోడ్‌, టిప్పు సుల్తాన్‌ రహదారి, పబ్లిక్‌ ఉద్యానవనం ప్రాంతాల్లోని ఆక్రమణలను పరిశీలించారు. రంజాన్‌, ఉగాది అనంతరం ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఉమేష్‌ కాంబ్లే పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

రాయచూరు రూరల్‌: నగరంలోని ఈద్గా మైదానంలో అభివృద్ధి పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ అధికారులకు సూచించారు. నగరంలోని యక్లాసపూర రహదారిలో 4 ఏకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టిన పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.

కొనసాగుతున్న విచారణ

రాయచూరు రూరల్‌: గోకాక్‌ మహాలక్ష్మి సహకార బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాగల్‌ కోటె జిల్లా జమఖండి బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామిజీని అరెస్ట్‌ చేసిన ధార్వాడ సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరుపై బ్యాంకు గుమస్తా సాగర్‌ సబకాళే రూ.80 లక్షలు జమ చేఽశారు. అదేవిధంగా బ్యాంకు పాలకమండలి సభ్యులు కోట్లాది రూపాయలు రుణాలుగా తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది. బాగల్‌ కోటె ఎస్పీ భీమా శంకర్‌ గుళేద్‌ మాట్లాడుతూ సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోందన్నారు.

ఎయిమ్స్‌ ఏర్పాటుకు

ఒత్తిడి తేవాలి

రాయచూరురూరల్‌: రాయచూరులో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్‌ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్‌ కళస డిమాండ్‌ చేశారు. అదివారం ఢిల్లీలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామిలను భేటీ చేసి ఎయిమ్స్‌ ఆవశ్యకతను వివరించారు. సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీలు ఎయిమ్స్‌ మంజూరులో రాయచూరు జిల్లా వాసులకు మొండి చేయి చూపారన్నారు. మరోమారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎయిమ్స్‌ మంజూరు చేయించాలని కోరారు.

చిక్క తిరుపతి ఆలయంలో పూజలు

మాలూరు: తాలూకాలోని ప్రసిద్ద యాత్రా స్థలమైన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో ఆదివారం లోకాయుక్త రిజిస్ట్రార్‌ అన్నుగౌడ వి పాటిల్‌ విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రవిస్వామి, గోపాలకృష్ణ భరద్వాజ్‌,, ఎన్‌ శ్రీధర్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తరువాత ఆయన కేజీఎఫ్‌ కోటిలింగ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పూజల్లో దేవాలయ ఈఓ టి సెల్వమణి, పేష్కార్‌ సి చెలువస్వామి దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బాలుడిపై లైంగిక వేధింపులు

హుబ్లీ: బాలుడిపై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటన పాత హుబ్లీలోని హెగ్గేరిలో ఆదివారం జరిగింది. సిరాజ్‌ ఉద్దీన్‌ ఎస్‌ (58) అనే వ్యక్తి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి ఉడాయించాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పాత హుబ్లీ పోలీసులు సిరాద్‌ ఉద్దీన్‌పై కేసునమోదు చేసి కొన్ని గంటల్లోనే అరెస్ట్‌ చేసి కోర్టులో హజరు పరిచారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు మలుపు సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన లింగన్న, వండ్రప్పలు గాయపడ్డారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో అనంతపురం నుంచి సొంతూరికి వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడ్డారు. క్షతగాత్రులను కూడేరు ఆస్పత్రికి తరలించారు.

ఆక్రమణల    తొలగింపునకు చర్యలు1
1/1

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement