బళ్లారి రూరల్ : అతిగా మొబైల్లో వీడియోలు, పాటలు వినడం వల్ల చెవికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఉపసభాపతి డాక్టర్ ఎస్.జే.వీ.మహిపాల్ తెలిపారు. బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, సరళాదేవి డిగ్రీ కళాశాల, ఒరెవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత చెవి పరీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అందరూ మొబైల్లో ఎక్కువగా వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్లో పాటలు వినటం వల్ల చెవికి సంబందించిన సమస్యలు వస్తున్నాయన్నారు. మొబైల్ను మితంగా వాడితే పలు సమస్యలు తగ్గుతాయన్నారు. సరళాదేవి కళాశాల ప్రిన్స్పాల్ జీ.ప్రహ్లాద్ చౌదరి మాట్లాడుతూ రెడ్క్రాస్ సంస్థ ఈ శిబిరాన్ని కళాశాలలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులకు చెవి పరీక్షలు నిర్వహించారు. బళ్లారి ఇండియన్ రెడ్క్రాస్ కార్యదర్శి ఎం.ఏ.షకీబ్, కో–ఆర్డినేటర్ బి.దేవణ్ణ, బ్లడ్ డొనేషన్ కమిటీ ఎం.ఎన్.నిసార్ అహమద్, ఒరెవా సంస్థ ప్రముఖురాలు బీకే జయశ్రీ, సభ్యురాలు పల్లవి పాల్గొన్నారు.
మొబైల్ అతివాడకంతో వినికిడి సమస్యలు