కొడుకు బాగు కోసం తండ్రి అప్పుల పాలు | - | Sakshi
Sakshi News home page

కొడుకు బాగు కోసం తండ్రి అప్పుల పాలు

Mar 17 2025 10:59 AM | Updated on Mar 17 2025 10:52 AM

రాయచూరు రూరల్‌: కుమారుడు బాగుండాలని తండ్రి ఎక్కడ చూసినా అప్పులు చేశాడు. ఆ డబ్బుతోనే కుమారుడు చదివి ఉద్యోగం సాధించాడు. తనకు అండగా ఉంటాడులే అనుకుంటున్న సమయంలో తనయుడు తన దారి తాను చూసుకున్నాడు. మరో వైపు అప్పులు కట్లలేక తండ్రి వీధిన పడ్డాడు. ఈ విషాద ఘటన విజయపుర అలకుంటకాలనీలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న వీరభద్ర, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బసవరాజు చదువు కోసం వీరభద్ర కొన్ని ఫైనాన్స్‌ సంస్థల్లో రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ డబ్బుతో విద్యను అభ్యసించిన బసవరాజుకు ఉద్యోగం లభించింది. అయితే భార్య చెప్పుడు మాటలు విని వేరు కాపురం పెట్టాడు. మరో వైపు తండ్రిపై అప్పుల భారం పడింది. అప్పులకు నెలకు వడ్డీ రూ.14 వేలు చెల్లించాల్సి వచ్చింది. కుమారుడు పైసా కూడా ఇవ్వలేదు. బాకీ చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థలు కోర్టు ద్వారా ఆర్డర్‌ తెచ్చి వీరభద్ర ఇంటిని సీజ్‌ చేశారు. దీంతో దంపతులు వీధిన పడ్డారు. చిన్నకుమారుడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారిని పట్టించుకునేవారే కరవయ్యారు. తమ బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ దంపతులు మౌనంగా రోదిస్తున్నారు.

ఉద్యోగం వచ్చాక పోషకులను విస్మరించిన తనయుడు

ఇంటిని వేలం వేసిన ఫైనాన్స్‌ సంస్థలు

రోడ్డు పాలైన దంపతులు

అలాంటి కుమారులకు ఆస్తులు దక్కరాదు :మంత్రి శరణు ప్రకాశ్‌ పాటిల్‌

తల్లిదండ్రులను విస్మరిస్తే వారికి ఆస్తులు దక్కకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శరణుప్రకాస్‌ పాటిల్‌ అన్నారు. అదివారం ఆయన కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. కొడుకు బాగా వృద్ధిలోకి రావాలని తండ్రి రూ.5 లక్షలు అప్పు చేసి చదివిస్తే ఉద్యోగం రాగానే తల్లిదండ్రులను విస్మరించిన ఉదంతం విజయపుర అలకుంట కాలనీలో చోటు చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వృద్ధులను విస్మరించే వారికి ఆస్తులు దక్కకుండా చేయాలన్నారు. బెళగావి మెడికల్‌ ఆస్పత్రిలో 150 మంది కి పైబడి సీనియర్‌ సిటిజన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారని, ఇది బాధాకరమన్నారు.

కొడుకు బాగు కోసం తండ్రి అప్పుల పాలు 1
1/1

కొడుకు బాగు కోసం తండ్రి అప్పుల పాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement