చెళ్లకెర రూరల్: చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలో మహనీయుడు కాయకయోగి శ్రీ గురుతిప్పేరుద్రస్వామి రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని రథంలో కొలువు దీర్చారు. అనంతరం అశేష భక్త జనుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం సాగింది. భక్తులు రథంపైకి అరటి పండ్లు, మెరియాలు వేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞగుండంలోకి భక్తులు వట్టి కొబ్బరి వేసి భక్తిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సంఘ సంస్థలు భక్తులకు పానకం, మజ్జిగ, తాగునీరు అందజేశారు. స్వామి వారి ముక్తి బావుటను బెంగళూరుకు చెందిన వాణిజ్య వేత తేజస్వి ఆరాధ్య రూ.63 లక్షలకు వేలంలో దక్కించుకుని భక్తిని చాటుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బీ.సుధాకర్, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, ఎమ్మెల్యే రఘుమూర్తి, జిల్లాధికారి టి.వెంకటేష్, తహసీల్దార్ రేహల్ పాషా అనేక మంది అధికారులు పాల్గొన్నారు.