హొసపేటె: తాలూకాలోని కల్లహళ్లి రాజాపుర వ్యవసాయ భూమిలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోని రెవెన్యూ, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ అధికారులకు ఉప లోకాయుక్త బీ.వీరప్ప తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఆయన సంక్లాపూర్ సమీపంలోని మున్సిపల్ ఘన వ్యర్థాల డంప్ యార్డును సందర్శించి, కల్లహళ్లి రాజాపూర్లోని పట్టా ల్యాండ్ సర్వే నెంబర్–144లోని వాలినాయక్కు చెందిన 4.81 సెంట్ల భూమిలో పది అడుగులకు పైగా లోతున మట్టిని తవ్వి తరలించారని, దీని వల్ల భవిష్యత్తులో సాగు చేయడం అసాధ్యంగా మారిందని ఏకరువు పెట్టారు. అక్రమంగా మట్టిని తొలగిస్తున్నారని తెలుసుకున్న తర్వాత, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ కీర్తికుమార్, భూవిజ్ఞాన శాస్త్ర కిరణ్ రెండు రోజులుగా ఆ స్థలంలో ఉన్న జేసీబీతో సహా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని తేలింది. గత 6 నెలలుగా మట్టి తవ్వకం గురించి రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్కు నివేదించామని గ్రామ నిర్వాహకుడు ప్రతాప్ సమాధానమివ్వగా, ఆ స్థలంలో ఉన్న తహసీల్దార్కు ఆ విషయం తెలియకపోవడంపై ఉపలోకాయుక్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సబ్ జైలు ఆకస్మిక సందర్శన
హొసపేటెలోని సబ్ జైలును శనివారం ఉప లోకాయుక్త బీ.వీరప్ప ఆకస్మికంగా సందర్శించారు. సబ్జైలు కమిషనర్ను జైలులో విచారణలో ఉన్న ఖైదీలకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, వారి తరపున వాదించడానికి నియమితులైన న్యాయవాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు తాము న్యాయవాదులను నియమించుకోలేదని చెప్పగా, ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలని జైలు అధికారులను ఆదేశించారు.
ఘన వ్యర్థాల డంప్యార్డ్ పరిశీలన
నగరంలో సంక్లాపుర సమీపంలో 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మున్సిపల్ ఘన వ్యర్థాల డంప్యార్డును శనివారం ఉప లోకాయుక్త సందర్శించారు. హొసపేటె నగరం నుంచి ప్రతి రోజూ ఉత్పత్తయ్యే 130 టన్నుల ఘన వ్యర్థాలను ఈ యూనిట్లో సేకరించి, ఆకుపచ్చ వ్యర్థాలు, పొడి చెత్తగా వేరు చేసి, కంపోస్ట్గా ఎలా ప్రాసెస్ చేస్తారో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మనోహర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ భూమిలోని మట్టి రవాణా పట్టని అధికారులు
అలసత్వ అధికారులపై ఉపలోకాయుక్త వీరప్ప మండిపాటు
అక్రమ మట్టి తవ్వకాలపై తనిఖీ