రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకు పోవడంతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటు, మహదాయి పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలా ఉండగా ఉత్తర కర్ణాటక రైతులకు మరొక షాక్ తగలనుంది. కృష్ణా నది ఆయకట్టులోని రైతులకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఆల్మట్టి డ్యాం నిర్మాణం విషయంలో రైతులకు పరిహారం అందించడంలో ముఖ్యమంత్రి నిధులు కేటాయించలేక పోయారు. మూడో విడత పనులు చేపట్టడానికి నిధుల కొరత ఏర్పడనుంది. విజయపుర జిల్లా బసవన బాగేవాడి వద్ద ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందింది. బాగల్కోటె, విజయపుర జిల్లాల్లో ముంపునకు గురవుతున్న 20 గ్రామాల ప్రజల పునర్వసతికి లక్ష ఎకరాల భూమి కావాల్సి ఉంది. భూస్వాధీనం ఇతర పనులకు రూ.87,818 కోట్ల మేర ఖర్చు కానున్నట్లు కృష్ణా భాగ్య జల నిగమ మండలి సర్కార్కు ప్రతిపాదనలు సమర్పించింది.
15 ఏళ్లుగా కాలయాపన
2010 డిసెంబర్లో కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు ఆధారంగా 524.256 మీటర్లకు ఎత్తును పెంచి నీటిని వాడుకోవడానికి అవకాశం కల్పించింది. 15 ఏళ్లు కావస్తున్నా నీటి వినియోగంలో కర్ణాటక ఇంకా వెనుకంజలో ఉంది. ఈ విషయంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి కర్ణాటక పావులు కదుపుతున్నట్లు గమనించిన మహారాష్ట్ర సర్కార్ అనవసరంగా వ్యతిరేకతను తెలుపుతోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే కర్ణాటకలోని అథణి తాలూకాలో పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి తప్ప మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేకపోయినా కావాలనే నీటి పోరు పెట్టుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే మహారాష్ట్రలోని సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వాదిస్తోంది.
ప్రారంభం కాని చర్చల ప్రక్రియ
ఈ విషయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి నివేదికలను కోరింది. నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చల ప్రక్రియ నేటికీ ప్రారంభం కావడం లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,000 కోట్లు, భూస్వాధీనం కోసం రూ.9 వేల కోట్ల నిధులు కేటాయించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర అడ్డు తగులుతున్నట్లు సమాచారం. నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమన్వయం కదురడం లేదు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కర్ణాటక రైతులకు లాభం కంటే నష్టాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆల్మట్టి డ్యాం(ఫైల్)
ఉత్తర కర్ణాటకలో ఆల్మట్టి ఆయకట్టు
రైతులకు మరొక షాక్
మూడు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ఎదురు దెబ్బ
నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం హుళక్కేనా?
కొలిక్కి రాని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం