కిడ్నీ దాతల కోసం
బనశంకరి: నేటి ఆధునిక యుగంలో మారిన జీవనశైలి, అధికంగా జంక్ ఫుడ్ తినడంతో పెచ్చుమీరుతున్న ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ సమస్య ఒకటి. కిడ్నీ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిడ్నీ జబ్బులత బాధపడుతూ ఆ అవయవ మార్పిడి కోసం 4,892 మంది వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రోగుల నుంచి డిమాండ్ అధికంగా ఉంది.
మూత్రవిసర్జన సమస్య, అధికంగా మూత్రవిసర్జనకు వెళ్లడం, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీల్లో నీటి బుడగలో పాటు అనేక కిడ్నీ జబ్బులు ప్రబలుతున్నాయి. గతంలో 60–70 ఏళ్లకు పైబడిన వారిలో కనబడేవి ఇలాంటి సమస్యలు. ప్రస్తుతం పిల్లలతో పాటు తక్కువ వయస్సు వారిలో కూడా రావడం ఆందోళన కలిగిస్తుంది. కానీ కారణాలు వేర్వేరు. ప్రారంభంలో సమస్య గుర్తించి చికిత్స తీసుకుంటే కిడ్నీ వైఫల్యం బారి నుంచి బయటపడవచ్చు. కానీ సరైన సమయంలో గుర్తించకపోతే నిత్యం డయాలసిస్, కిడ్నీ తొలగింపు అనివార్యం. మూత్రపిండాలు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? ముందుగా కనిపెట్టాలి. మూత్రపిండాల ఆరోగ్యం కాపాడాలి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మూత్రపిండాల రోగం బారిన పడిన వెంటనే చికిత్స తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దృష్టిలో రోగులకు ఔషధాలు అందించే వైద్యులు సైతం జాగ్రత్త వహించాలి. కిడ్నీ ఆరోగ్యానికి సమస్యగా మారకుండా సరైన మోతాదులో ఔషధాలు అందించాలి. అదేవిధంగా రోగులు సైతం వైద్యుల సలహాలు తీసుకోకుండా నొప్పి నివారణతో పాటు ఎలాంటి ఔషధాలు, మాత్రలు సేవించరాదని జాగృతి కల్పించడం ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఉద్దేశం.
రోగ లక్షణాలు...
ఆయాసం అధికంగా ఉండటం, కాళ్లలో వాపు, నడవడం సాధ్యం కాకపోవడం, వాంతులు, మూత్రవిసర్జన మార్పులు, నొప్పి, మంటతో కూడిన మూత్రం, జ్వరం వచ్చినప్పుడే నడుము నొప్పి, కళ్లు ఉబ్బడం, మూత్రం రంగు మారడం, నురగ, రక్తస్రావం, సమస్య తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు, శరీరంపై దురదలు కిడ్నీ జబ్బుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు.
మూత్రపిండాల నిర్వహణ ఎలా..?
ప్రతి మనిషికి రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఒక మూత్రపిండం ఉన్నప్పటికీ ఉత్తమ జీవితం గడపవచ్చు. మూత్రపిండాలు శరీరంలో రక్తం శుభ్రం చేయడం, శరీరంలో పేరుకుపోయిన చెత్తను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. విటమిన్ డీ ఉత్పత్తి చేసి ఎముకలకు శక్తినిస్తుంది. ఎర్ర రక్తకణాలను అభివృద్ధి చేసి శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. రెమిన్ అనే అంశం బీపీ, నీరు, లవణాలు, ఆమ్లం అంశాలను నియంత్రిస్తుంది.
రోగం తీవ్ర దశలోకి చేరుకునే వరకు ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తారు. అది మూత్రపిండాల సమస్యకు దారి తీస్తుంది. దీంతో కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో జాగృతి అవసరం. కిడ్నీ ఆరోగ్య పరీక్షలు, రోగ లక్షణాల గురించి అవగాహన కల్పించాలని నెఫ్రో యూరాలజీ సంస్థ డైరెక్టర్ అధ్యాపకుడు డాక్టర్ శివలింగయ్య తెలిపారు.
తరచూ పరీక్షలు ముఖ్యం
మూత్రంలో ప్రొటీన్, ఆల్బుమిన్ అంశాలు ఎంత ప్రమాణంలో బయటికి వెళుతుంది అనేది పరీక్ష చేయించాలి. దీంతో పాటు మధుమేహం, బీపీ పరీక్షలు చేయాలి. పరిమితంగా వ్యాయామం, సమయానికి సరైన తాజా ఆహారం తినడం, నిద్ర, భోజనంలో అధికంగా ఉప్పు వాడరాదు, అధికంగా నీరు తాగడం, గర్భిణులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మన మూత్రపిండాలు సక్రమంగా ఉన్నాయా? అనే నినాదంతో 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ(ఐఎస్ఎన్) ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో మొదటిసారిగా ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం నిర్వహించింది. కిడ్నీ ఆరోగ్యం, సంబంధిత సమస్యల గురించి ప్రజలకు సమాచారం అందించడానికి 66 దేశాల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రస్తుతం 80కి పైగా దేశాల్లో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం నిర్వహించి కిడ్నీ ఆరోగ్యం గురించి జాగృతం చేస్తోంది.