రసాయన రంగులు చల్లిన ఆకతాయిలు | - | Sakshi
Sakshi News home page

రసాయన రంగులు చల్లిన ఆకతాయిలు

Mar 15 2025 12:15 AM | Updated on Mar 15 2025 7:44 AM

దొడ్డబళ్లాపురం: హోలీ సందర్భంగా ఆకతాయిలు రసాయన మిశ్రిత రంగులు చల్లడంతో నలుగురు యువతులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గదగ్‌ జిల్లా లక్ష్మేశ్వర తాలూకా సువర్ణగిరి తాండాలో చోటుచేసుకుంది. గౌరి పూజార, దివ్య లమాణి, అంకిత లమాణి, తనూషలు శుక్రవారం బస్టాప్‌లో నిలబడి ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన ఆకతాయిలు వారిపై రంగులు చల్లి పరారయ్యారు. తక్షణం నలుగురూ అస్వస్థతకు గురయ్యారు. లక్ష్మేశ్వర పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. రంగుల్లో కోడిగుడ్లు, మట్టి, ఎరువు, కెమికల్‌ మిశ్రిత రంగులు కలిపినట్టు తెలిసింది.

కేఎస్‌ ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

యశవంతపుర: కేఎస్‌ఆర్‌టీసీ బస్సుపై మరాఠీ ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని కొల్లాపుర జిల్లా ఇచలకరంజి గ్రామం నుంచి బస్సు శుక్రవారం చిక్కోడికి వెళ్తుండగా హొలీ ఆడుతున్న ఆకతాయిలు బస్సుకు మసి పూసి, రాళ్లతో దాడి చేశారు. ఇటీవల కేఎస్‌ ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై దాడి జరిగి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని రోజులపాటు బస్సుల సంచారం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

స్వామీజీ కాళ్లపై పడ్డ

పోలీసుల బదిలీ

దొడ్డబళ్లాపురం: యూనిఫాంలో ఉంటూ స్వామీజీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్న ఆరుమంది పోలీసులకు ఉన్నతాధికారులు బదిలీ శిక్ష విధించారు. బాగలకోటె జిల్లా బాదామి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆరుమంది ఒక స్వామీజీ కాళ్లమీదపడి ఆశీర్వాదం తీసుకుని తలా రూ.500 డబ్బు కూడా తీసుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జిల్లా ఎస్పీ అమరనాథ్‌ రెడ్డి ఆరుమంది పోలీసులపై బదిలీ వేటు వేశారు.

ఏనుగు దాడిలో మహిళ మృతి

మండ్య: ఏనుగు దాడిలో మహిళ మృతి చెందినఘటన హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కూగోడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సుశీలమ్మ కాఫీ తోటలో పనులు ముగించుకొని వస్తుండగా మాటు వేసిన ఏనుగు దాడి చేసింది. తొండంతో విసిరేయడంతో తల భాగంలో తీవ్ర గాయాలై మృతి చెందింది. మహిళ మృతితో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చీకనహళ్లి–బేలూరు రోడ్డులో టైర్లకు నిప్పు పెట్టి బైఠాయించారు. వారు మాట్లాడుతూ రెండు నెలల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు ఏనుగు దాడిలో మృతి చెందారని, అయినా అటవీశాఖ ఏనుగులను నియంత్రించడం లేదని మండిపడ్డారు. అనంతరం అటవీశాఖ అధికారులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

కపట ప్రేమకు మరో యువతి బలి

హావేరిలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

హుబ్లీ: మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని యువతి ప్రాణాలను ప్రేమ పేరుతో ఓ యువకుడు పొట్టన బెట్టుకున్నాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి హత్యకు గురి కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను అనుమానిస్తుండగా, ప్రధాన నిందితుడు నయాజ్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు గురైన యువతిని రత్తిహళ్లి మసూరు గ్రామానికి చెందిన స్వాతి రమేష్‌ బ్యాడగి(22)గా గుర్తించారు. ఈ నెల 6న యువతి మృతదేహాన్ని రాణిబెన్నూరు తాలూకా పత్తెపుర గ్రామం వద్ద తుంగభద్ర నది సమీపంలో కనుగొన్నారు. ముందుగా గుర్తు తెలియని యువతి శవంగా భావించిన హలగేరి పోలీసులు వారసుదారులు లేని నేపథ్యంలో పోస్టుమార్టం నిర్వహించి చట్టప్రకారం స్వాతి శవాన్ని పూడ్చిపెట్టారు. పోస్టుమార్టంలో స్వాతి హత్యకు గురైనట్లు ధ్రువ పడింది. దీంతో దర్యాప్తు చేపట్టిన హలగేరి పోలీసులు ఈ నెల 3న కనిపించకుండా పోయిన యువతి ఆచూకీని కనుగొన్నారు. ఈ క్రమంలో స్వాతి తల్లి హిరేకెరూరు పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తె కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లుగా తెలుసుకున్నారు. స్వాతి తండ్రి మృతి చెందగా, తల్లితో పాటు యువతి నివసిస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా అనుమానిస్తున్నారు. దర్యాప్తు చురుగ్గా చేపట్టినట్లు హలగేరి పోలీసులు తెలిపారు. కాగా హిందూ సంఘాలు సోషల్‌ మీడియాలో జస్టిస్‌ ఫర్‌ స్వాతి అభియాన్‌ను ప్రారంభించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement