
టెండర్ కోసం వేచి ఉన్న పత్తి లోడ్ వాహనాలు
రాయచూరు రూరల్: తెల్ల బంగారాని(పత్తి)కి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతులు తల్లడిల్లిపోతున్నారు. గత ఏడాది క్వింటాల్కు రూ.8,500 నుంచి రూ.9000 ధర ఉండగా ఈసారి రూ.6,800 నుంచి రూ.7100 ధర పలుకుతోంది. నూతన పత్తి మార్కెట్లో ధరను ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాల్కు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అధికంగా తెలంగాణలోని కృష్ణా, మక్తల్, నారాయణపేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల, ధరూరు, నందిన్ని, బలిగేర, అయిజ, ఆంధ్రప్రదేశ్లోని మాధవరం తదితర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు వస్తున్నాయి. ప్రతి నిత్యం హైదరాబాద్–రాయచూరు రహదారిలో పత్తితో లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్లతో రైతులు పత్తిని తీసుకు రావడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని నదుల్లో నీరున్నా, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో నదుల నీరందక రైతులు భూముల్లో వేసుకున్న పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. రైతులు జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి, 86 వేల ఎకరాల్లో కందులు సాగు చేశారు.
కళ్యాణ కర్ణాటకలో పత్తి దిగుబడి ఘనం
మార్కెట్లో తెల్ల బంగారానికి ధర అధమం

రాయచూరులోని నూతన పత్తి మార్కెట్ ప్రవేశ ద్వారం