
రాజగోపాలాచారి విగ్రహానికి కలెక్టర్ నివాళి
హోసూరు: భారత మొట్టమొదటి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి 145వ జయంతిని ఘనంగా ఆచరించారు. ఆదివారం హోసూరు తాలూకా తొరపల్లిఅగ్రహారంలోని ఆయన స్వగృహంలో కలెక్టర్ శరయు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. రాజాజీ జీవిత చరిత్రపై ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్, ఉపమేయర్ ఆనందయ్య, అధికార్లు స్వామినాథన్, రాజప్రకాష్, తహసీల్దార్ సుబ్రమణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆరుబయలే అంచెట్టి బస్టాండు
కెలమంగలం: క్రిష్ణగిరి జిల్లా చిట్టచివరి తాలూకా అంచెట్టిలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని అంచెట్టి చుట్టుప్రక్కల నాట్రాంపాళ్యం, ఉరిగం, మంచుగొండపల్లి, తగ్గట్టి తదితర వందకుపైగా గ్రామాలున్నాయి. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, తమిళనాడులోని హోసూరు తదితర ప్రాంతాల నుంచి రోజూ వేలాది మంది పర్యాటకులు ఈ మార్గంలోనే హొగేనకల్కు వచ్చి వెళ్లుతున్నారు. బస్సులు రోజూ ఎక్కువ సంఖ్యలో తమిళనాడు, కర్ణాటక బస్సులు అంచెట్టికి వచ్చి వెళ్తుంటాయి. కానీ సరైన బస్టాండు లేక స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయటే బస్సులు వచ్చి వెళ్తుంటాయి. వర్షాకాలం, ఎండాకాలంలో ప్రయాణికులకు అవస్థలే. భవన సముదాయంతో కూడిన ఆధునిక బస్టాండును ఏర్పాటు చేయాలని కోరారు.

అంచెట్టి బస్టాండు ఇదే