
క్రిస్మస్ వేడుకల్లో చిన్నారుల డ్యాన్స్
శివాజీనగర: క్రైస్తవ సముదాయంలో ఎవరి నోట విన్నా క్రిస్మస్ మాటే. లోకానికి సరికొత్త వెలుగులు పంచి సమస్త మానవాళిని పాపకూపం నుంచి విముక్తులను చేసిన యేసుక్రీస్తును స్మరిస్తూ బెంగళూరు నగరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరమంటుతున్నాయి. చర్చీలలో సామూహిక ప్రార్థనలు క్రైస్తవులను భక్తి పారవశ్యంతో ముంచెత్తుతున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో అత్యధిక సంఖ్యలో చేరుకునే మిస్పా తెలుగు చర్చీలో ప్రతి రోజు ముందస్తు క్రిస్మస్ సందడి నెలకొంది. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను వివిధ రీతుల్లో నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఆదివారం మహిళా క్రిస్మస్ జరుపగా, ఈ ఆదివారం పిల్లల క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. చర్చీ పాస్టర్ రెవరెండ్ బెరాకా హ్యాండీ, కార్యదర్శి కెప్టన్ జాన్, సంఘ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన పిల్లల క్రిస్మస్లో పిల్లలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు అలరించాయి. క్రైస్తవ భక్తి పాటలతోనూ, బైబిల్ పఠనం, డ్యాన్స్, బైబిల్లోని వివిధ సంఘటనలను జ్ఞాపకం చేసుకొంటూ నిర్వహించిన స్క్రిప్ట్లు సంఘ సభ్యులను మంత్ర ముగ్ధులను చేశాయి. అంతకు ముందుగా పిల్లల క్రిస్మస్ వేడుకల గురించి దైవ వర్తమానాన్ని వినిపించిన సంఘకాపరి రెవరెండ్ బెరాకా హ్యాండీ, పరిశుద్ధ బైబిల్ గ్రంధంలోని వాక్యాలను వినిపించి బాల్యం నుండే పిల్లలను భక్తితో పెంచాలని ఉపదేశించారు.

మిస్పా చర్చీ ఆవరణంలో పిల్లల క్రిస్మస్ వేడుకలు