
హనుమంతపురం వద్ద ఏనుగులు
హోసూరు వార్తలు..
క్రిష్ణగిరి: హోసూరు సమీపంలోని హనుమతపురం అటవీ ప్రాంతంలో 70 ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బెంగళూరు బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి వందకు పైగా ఏనుగులు జవుళగిరి అటవీ ప్రాంతం మీదుగా డెంకణీకోట సమీపలోని నగనూరు, బేవనత్తం, ఉడేదుర్గం, శ్యానమావు అటవీ ప్రాంతాలకు చేరుకొన్నాయి. ఆదివారం ఉదయం 70 ఏనుగులు హనుమంతపురం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు కనిపించాయి. వెంటనే విషయాన్ని అటవీశాఖాధికార్లకు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నం చేపట్టారు. శ్యానమావు, ఆళియాలం, పోడూరు, రామాపురం తదితర చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారు.
