
కృష్ణరాజపురం: హోసకోటె నియోజకవర్గంలోని అప్పసంద్ర గ్రామంలో ఆదివారం దాస శ్రేష్ట కనకదాస 536వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బంగారు, నగదు చోరీ
మైసూరు: ఓ ఇంటిలో చోరీ జరిగిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా బిళికెరె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుధా అనే మహిళ పొరుగూరికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళం బద్దలు కొట్టి ఇంటిలో ఉన్న రూ. 4.5 లక్షల విలువైన బంగారు, నగదు చోరీ చేశారు. ఇంటికి వచ్చిన బాధితురాలు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ పర్సులో బంగారం..
మహిళ పర్సులో 55 గ్రాముల బంగారం నగలు చోరీ అయిన ఘటన హుణసూరు పట్టణంలోని బస్టాండులో చోటు చేసుకుంది. హెబ్బాలు గ్రామానికి చెందిన సునంద బాధితురాలు. ఈమె టికెట్ తీసుకోవడానికి పర్సులో చూడగా అందులో ఉన్న 55 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
గౌరిబిదనూరు: తాలూకాలో ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేశారు. తొండేబావి, అలకాపుర, హోసూరు, ముదుగెరె, కాదలవేణి, గదరె తదితర గ్రామాలలో అంగనవాడి భవనాలు, సిసి రోడ్లు, మురికి కాల్వలు, గ్రంథాలయాల భవనాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల మనసులు సూక్ష్మమైనవని, వారికి తగ్గట్టుగా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో , పంచాయతీరాజ్ అధికారి రఘునాథ్, ఇంజనీర్ చలువరాజ్, లక్ష్మణరావ్, నారాయణస్వామి, కాంతరాజు, నరసింహమూర్తి, జీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తల ధర్నా
మండ్య: కాంగ్రెస్ నేతల వద్ద కోట్ల కొద్ది అక్రమ నగదు బయట పడుతుండటంపై కేంద్ర మంత్రి కిశన్పాల్ గుర్జర్ ఆధ్వర్యంలో మండ్య నగరంలో ఆదివారం బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మండ్య నగరంలోని జేసీ సర్కిల్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు, నాయకులు, రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉమేశ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్సాహు ఇంటిపై మూడు రోజుల పాటు ఐటీ అధికారులు దాడి చేయగా ఇప్పటికే వందల కోట్ల నగదు దొరికిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటుగాళ్లు అరెస్ట్
యశవంతపుర: పెళ్లి కుదిరిస్తామని నమ్మించి విశ్రాంత సైనికాధికారి నుంచి లక్షల నగదు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కొడగులో జరిగింది. ఫైజల్, అబ్దుల్ బషీర్, సాదిక్లను మడికేరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన జాన్ మ్యాథ్యు అవివాహితుడు. సైన్యాకాధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. ముగ్గురు నిందితులు జాన్కు పరిచయం అయ్యారు. కొద్ది రోజుల తరువాత పెళ్లి చేస్తామని నమ్మించి లక్షలు డబ్బులను తీసుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక మహిళతో జాన్కు సరళంగా పెళ్లి చేశారు. అనంతరం పెళ్లి ఫొటోలను తమ వద్ద పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించారు. నిందితులు రూ.8 లక్షలు నగదుతో పాటు, రూ.2.10 లక్షలు విలువగల చెక్కులు తీసుకున్నారు. జాన్ ఫిర్యాదు ఆధారం మడికేరి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

కనకదాస చిత్రపటానికి ఎమ్మెల్యే పూజలు

అంగన్వాడీ భవనానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ