
బనశంకరి: కార్తీక మాసం చివరి సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించే బసవనగుడి దొడ్డబసవణ్ణ శెనక్కాయల పరుష ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. ఉదయం దేవదాయశాఖమంత్రి రామలింగారెడ్డి పరుషను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి శెనక్కాయలను రుచి చూశారు. దొడ్డబసవణ్ణకు శెనక్కాయలతో అలంకరణ చేపట్టగా భక్తులు బారు లు తీరి బసవణ్ణ, దొడ్డగణపతిని దర్శించుకున్నారు.
శెనక్కాయల రాసులు:
బుల్టెంపుల్ రోడ్డుకు ఇరువైపుల శెనక్కాయల రాసులు దర్శనమిస్తున్నాయి. కనకపుర, దొడ్డబళ్లాపుర, రామనగర, చిక్కబళ్లాపుర, కోలారు, మాగడి, మైసూరు, మండ్య, తుమకూరు జిల్లాల నుంచి రైతులు, వ్యాపారస్తులు శెనక్కాయలను పరుషకు తీసుకువచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో కుటుంబ సమేతంగా నగరవాసులు తరలివచ్చి శనక్కాయలు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. బసవనగుడి బుల్టెంపుల్రోడ్డులో పల్లె వాతావరణం కనిపించింది. దేవస్థానం చుట్టుపక్కన పిల్లలు ఆటవిడుపు కోసం జెయింట్వీల్, స్కూటర్ రైడింగ్, వివిధ క్రీడా యంత్రాలను ఏర్పాటు చేశారు. శనక్కాయలు కొనుగోలు చేసే వారు దుస్తులు, బట్టలతో తయారు చేసిన సంచులు తీసుకురావాలని ప్రజలను జాగృతం చేస్తున్నారు. శనక్కాయల పరుషను సోమవారం ఉదయం దొడ్డబసవణ్ణకు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం ఆలయం ముందు దొడ్డబసవణ్ణకు శెనక్కాయలతో తులాభారం నిర్వహించి పరుషను లాంఛనంగా ప్రారంభిస్తారు. పరుష రెండురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది పరుషకు విచ్చేసే అవకాశం ఉంది. పరుషలో శెనక్కాయలు శేరు రూ.50 నుంచి 80 రూపాయలు, కిలో రూ.100 విక్రయిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ కాకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
రామలింగారెడ్డి
జాతరకు భారీగా తరలివస్తున్న
నగర వాసులు

