
నరికివేసిన ఓ చెట్టు
శివాజీనగర: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్.నిజలింగప్ప, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి అపారమైన సేవలందించారని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆదివారం నిజలింగప్ప జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కాగా, దేశంలో కాంగ్రెస్వారినే లక్ష్యంగా పెట్టుకొని ఐటీ దాడులు జరుగుతున్నాయని, బీజేపీవారిపై ఐటీ దాడి జరిగితే లెక్కలేనంత నగదు లభిస్తుందని సీఎం అన్నారు. ఎవరి ఇంటిలో నగదు లభించినా అది తప్పే. చట్టపరంగా ఎవరు తప్పు చేసినా వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇందులో బీజేపీవారికి ఎందుకు మినహాయింపు ఇస్తున్నారో తెలియడం లేదని దుయ్యబట్టారు.
ఇంటి ముందున్న గంధం చెట్ల చోరీ
శివమొగ్గ: ఇంటి ముందు ఉన్న రెండు శ్రీగంధం చెట్లను దుండగులు నరికి ఎత్తుకెళ్లిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలోని రాంపుర లేఔట్లో జరిగింది. పర్యావరణ కార్యకర్త గౌతమ్ ఇంటి ఆవరణలో గంధం చెట్లను పోషిస్తున్నాడు.
ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో దుండగులు రంపాలతో చెట్లను కోసి చోరీ చేశారు. రాత్రి వరకూ ఉన్న చెట్లు పొద్దున చూడగానే లేకపోవడంతో గౌతమ్ ఆవేదనకు లోనయ్యాడు. ఇందులో ఒక చెట్టు వయసు 22 సంవత్సరాలు, మరో చెట్టుకు 18 సంవత్సరాలు ఉన్నాయి. అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గౌతమ్ తెలిపారు. గంధం చెట్లను పెంచుతున్న వారిలో ఈ చోరీ గుబులు రేకెత్తించింది.