● ఏమైనా జరగొచ్చు: కుమారస్వామి
యశవంతపుర: లోక్సభ ఎన్నికలు ముగియగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానని ఒక కాంగ్రెస్ నాయకుడు బీజేపీ కేంద్ర నాయకులకు చెప్పాడని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హాసన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు 50 మంది ఎమ్మెల్యేలను తెస్తానని చెప్పిన సంగతి తెలిసింది. ఆయనెవరో చెప్పను. కానీ 50 మంది ఎమ్మెల్యేలను తీసుకురావడమంటే చోటా నాయకునితో ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో మాదిరిగా రాజకీయ మార్పులు ఇక్కడ జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని, ఎవరిలోనూ నీతి నిజాయతీ లేదని, స్వార్థమే ముఖ్యమై పోయిందని కుమార వాపోయారు. సీఎం సిద్ధరామయ్య కులం పేరుతో వైషమ్యాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులగణన ఎవరికి కావాలి, ఆర్థిక, సామాజిక స్థితిగతుల గణన ఒకటి చాలన్నారు. ముస్లింలకు రూ. 10 వేలు కోట్లు ఇస్తే వద్దనను, కానీ హిందువుల్లో పేదలు, దళితులను మరిచిపోరాదన్నారు. కాంగ్రెస్లో బీకే హరిప్రసాద్తో పాటు ఎంతోమంది సిద్దరామయ్యను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.