రాయచూరు రూరల్: రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ–జేడీఎస్ పొత్తుకు సిద్ధమైన నేపథ్యంలో జేడీఎస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో భవిష్యత్ కార్యచరణకు సిద్ధమయ్యారు. సోమవారం కలబుర్గి మెట్రో ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి ఎన్ఎం నబీ, మైనార్టీ మాజీ అధ్యక్షుడు నాసిర్ హుసేన్ ఆధ్వర్యంలో మైనార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు, కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాలకు చెందిన మైనార్టీ నేతలు పాల్గొన్నారు. బీజేపీతో జేడీఎస్ జత కట్టడాన్ని మైనార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి నేడు ఆ పార్టీ నేతలను కొనియాడటం సిగ్గుచేటని సమావేశంలో ప్రస్తావించారు. ఈనెల 8న బెంగళూరులో మైనార్టీల సభ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. జేడీఎస్ పార్టీని బలోపేతం చేయకుండా మరోపార్టీతో చేతులు కలపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఈనెల 16 వరకు సమయం కోరిన విషయంపై చర్చించారు. ప్రజాభిప్రాయాలను కూడా సేకరించాలని సమావేశంలో తీర్మానించారు.
రాజీనామాలకు సిద్ధమైన జేడీఎస్ మైనార్టీ నేతలు ?
8న బెంగళూరులో మైనార్టీల సభ