బనశంకరి: సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ముందంజలో ఉందని విదేశీయులు మన సాంకేతిక పరిజ్ఞానానికి వెంట పడుతున్నారని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్ జీ.సతీశ్రెడ్డి తెలిపారు. యలహంక ఓ యూనివర్శిటీలో సివిల్, ఏరోనాటికల్, మెకానికల్ ఇంజనీరింగ్ రంగాలపై రెండురోజుల పాటు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమ్మేళనాన్ని డాక్టర్ జీ.సతీశ్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఒకటిన్నర దశాబ్దం వరకు మన దేశ పరిశ్రమలు, అభివృద్ధి కేవలం విదేశీయుల నుంచి దిగుమతి చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం, సామాగ్రిపై ఆధారపడేవారమన్నారు. కానీ ప్రస్తుతం స్వల్ప అవధిలోనే భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. మనదేశంలోనే పరికరాలను ఉత్పత్తి చేసి వందలాది యుద్ధ విమానాలను ఉత్పత్తి చేశామని, వాటికి నేడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. ఇక ఇస్రో గగనయాన్ పేరుతో అంతర్జాతీయస్థాయిలో పేరుపొందామని తెలిపారు.